
- తొలగింపునకు 3 నెలల గడువు
న్యూఢిల్లీ: అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ–కామర్స్ ప్లాట్ఫారాల్లో కస్టమర్లను తప్పుదోవ పట్టించే డార్క్ ప్యాటర్న్లను తొలగించాలని సంబంధిత కంపెనీలను కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆదేశించింది. ఇందుకోసం మూడు నెలల గడువు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (సీసీపీఏ) మార్గదర్శకాలు జారీ చేసింది. డార్క్ప్యాటర్న్ల తరహా మోసాలు లేకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని స్పష్టం చేసింది.
వీటిని తీసేయడానికి సెల్ఫ్- ఆడిట్స్ నిర్వహించాలని సూచించింది. వినియోగదారులకు, ఈ–కామర్స్ ప్లాట్ఫారాలకు మధ్య నమ్మకాన్ని పెంపొందించేందుకు సెల్ఫ్-డిక్లరేషన్స్ ఇవ్వాలని కూడా కంపెనీలను కోరినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. డార్క్ప్యాటర్న్లను తొలగించేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖలు, నియంత్రణ సంస్థలు, స్వచ్ఛంద వినియోగదారుల సంస్థలు, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో జాయింట్ వర్కింగ్ గ్రూప్ను కూడా ఏర్పాటు చేసింది.
ఇది ఈ–కామర్స్ ప్లాట్ఫారాల్లో డార్క్ప్యాటర్న్లను గుర్తించి ఎప్పటికిప్పుడు వినియోగదారుల వ్యవహారాల విభాగానికి సమాచారాన్ని అందిస్తుంది. వినియోగదారులలో అవగాహన కల్పించడానికి తగిన కార్యక్రమాలను కూడా సూచిస్తుంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గత నెల 50కి పైగా ఈ–కామర్స్సంస్థలు, నాస్కామ్ వంటి పరిశ్రమ సంఘాలు, వినియోగదారుల సంఘాలతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి డార్క్ ప్యాటర్న్లను గురించి చర్చించారు. ముఖ్యంగా 13 రకాల డార్క్ప్యాటర్న్లను వల్ల వినియోగదారులు మోసపోతున్నట్టు గుర్తించారు. తమశాఖ కంపెనీలకు మొత్తం 401 నోటీసులు జారీ చేసిందని, వాటిలో 11 డార్క్ ప్యాటర్న్లకు సంబంధించినవని సీసీపీఏ తెలిపింది.
డార్క్ ప్యాటర్న్ అంటే...
డార్క్ ప్యాటర్న్లు వినియోగదారుల మానసిక బలహీనతలను, తొందరపాటును లేదా వివరాలను సరిగ్గా గమనించకపోవడాన్ని ఉపయోగించుకుని లాభం పొందుతాయి. ఇవి కస్టమర్లు విచక్షణతో నిర్ణయం తీసుకునే శక్తిని దెబ్బతీస్తాయి. కొన్ని ఈ–కామర్స్ ప్లాట్ఫారాలను గమనిస్తే.. ఆర్డర్ఇచ్చేటప్పుడు.. ‘‘ఒకటి మాత్రమే మిగిలి ఉంది’’, ‘‘ఈ అవకాశం 10 నిమిషాలు మాత్రమే", ‘‘లోయెస్ట్ ప్రైస్’’ వంటి సందేశాలను చూపిస్తాయి. వినియోగదారులను వెంటనే కొనుగోలు చేసేలా ఒత్తిడి చేస్తాయి. కస్టమర్లకు తెలియకుండానే లేదా వారి అనుమతి లేకుండా షాపింగ్ బాస్కెట్లోకి అదనపు ఉత్పత్తులను చేరుస్తాయి.
ఉదాహరణకు.. స్వచ్ఛంద సంస్థలకు విరాళం అంటూ కొంత మొత్తాన్ని చేర్చుతాయి. మరో డార్క్ప్యాటర్న్ ఏమిటంటే.. మొదట తక్కువ ధరను చూపిస్తారు. పేమెంట్ పేజీకి వచ్చాక అదనపు చార్జీలు, ప్యాకేజింగ్ చార్జీల వంటివి చేర్చుతారు. కొన్ని ప్లాట్ఫారాలు ప్లాన్సబ్స్క్రిప్షన్లను మన అనుమతి లేకుండానే బాస్కెట్లోకి చేర్చుతాయి. ఆ ప్లాన్ను తీసుకున్నప్పటికీ, తదనంతరం వద్దనుకుంటే క్యాన్సిల్ చేసుకునే ప్రక్రియను చాలా కష్టతరం చేస్తాయి.
కొన్ని సైట్లు ట్రావెల్ఇన్సూరెన్స్ వంటివి కొనాలంటూ మెసేజ్ పంపుతాయి. నో ఆప్షన్ను నొక్కితే ‘నాకు భద్రత అవసరం లేదు’ లేదా ‘నేను డబ్బు ఆదా చేయను’ అని కనిపిస్తుంది. ఇలాంటి ప్రతికూల పదాలను ఉపయోగించడం ద్వారా కస్టమర్తాను తప్పుచేస్తున్నానని భావించేలా చేస్తారు. ఇంకో అక్రమ విధానం ఏమిటంటే .. కస్టమర్ టీవీకి ఆర్డర్ఇస్తే స్టెబిలైజర్ను లేదా ఎక్స్ట్రా వారంటీని అంటగట్టడానికి ప్రయత్నిస్తారు. మనం ఎంచుకున్న మోడల్కు ప్రత్యామ్నాయంగా వేరే మోడల్స్ చూపిస్తారు.