దేశవ్యాప్తంగా 25వేల మందికిపైగా జ్యుడీషియల్ అధికారులకు తీపి కబురు. వారందరికీ 2016 జనవరి 1 నుంచి పెంచిన పే స్కేల్ ను అమలు చేయాలని సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పే స్కేల్ బకాయిలను జ్యుడీషియల్ అధికారులకు మూడు విడతల్లో చెల్లించాలని సూచించింది. మొదటిసారి మూడు నెలల్లో 25 శాతం బకాయిలను, రెండోసారి 3 మూడు నెలల్లో 25 శాతం, మూడోసారి మూడు నెలల్లోగా మిగతా 25 శాతం బకాయిలను అందించాలని నిర్దేశించింది.
2023 సంవత్సరం జూన్ 30లోగా పే స్కేల్ బకాయిల చెల్లింపును పూర్తి చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. జ్యుడీషియల్ అధికారుల పే స్కేల్ ను సవరించడం అత్యవసరమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు ఇచ్చింది. ప్రతి ఐదు నుంచి పదేళ్లకోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల వేతనాలను సవరిస్తున్నప్పటికీ.. జ్యుడీషియల్ అధికారుల వేతనాల సవరణ జరగడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.