బయోలాజికల్‌ ఈ వ్యాక్సిన్.. డోసు రూ.150

బయోలాజికల్‌ ఈ వ్యాక్సిన్.. డోసు రూ.150

న్యూఢిల్లీ: హైదరాబాద్​కు చెందిన బయోలాజికల్‌‌–ఈ సంస్థ త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న టీకా ధర ఒక్కో డోసు ధర రూ.150 దాకా ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే.. 30 కోట్ల డోసులను రిజర్వు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపాయి. ఇందులో భాగంగా రూ.1,500 కోట్లను ముందుగా చెల్లిస్తున్నట్లు చెప్పాయి. వ్యాక్సిన్​ను ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా బయోలాజికల్‌‌--–ఈ సంస్థ తయారు చేసి, నిల్వ చేస్తుందని,  వచ్చే కొన్ని నెలల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్

బయోలాజికల్–ఈ తయారు చేస్తున్న వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్​లో ఉంది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ట్రయల్స్​లో మంచి ఫలితాలు వచ్చాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. స్వదేశీ వ్యాక్సిన్ తయారీదారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చాలా ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగానే రీసెర్చ్, అభివృద్ధి, ఖర్చు కోసం సాయాన్ని అందిస్తున్నామని చెప్పింది. ఐదు లేదా ఆరు కొత్త కరోనా వ్యాక్సిన్లను సపోర్టు చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన మిషన్​లో ఇది ఓ భాగమని పేర్కొంది. బయోలాజికల్–ఈ సంస్థకు బయోటెక్నాలజీ డిపార్ట్‌‌మెంట్ ఇప్పటికే రూ.100 కోట్ల సాయం అందజేసిందని తెలిపింది. బయోలాజికల్-–ఈతో కలిసి పలు స్టడీలు చేసేందుకు భాగస్వామిగా ఉందని వెల్లడించింది.

‘జాన్సన్’తో బయోలాజికల్ ఒప్పందం

సొంతంగా టీకా తయారు చేసే పనిలో ఉన్న బయోలాజికల్–ఈ.. జాన్సన్ & జాన్సన్ సంస్థ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు కూడా ఒప్పందం చేసుకుంది. ఏడాదికి 60 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రొడ్యూస్ చేసేందుకు సపరేట్ డీల్ కుదుర్చుకుంది. దేశంలో వ్యాక్సిన్ తయారీకి లైసెన్స్ పొందినట్లు కంపెనీ చెప్పింది.