డిసెంబ‌ర్ 13 నుంచి కవ్వాల్​లో బర్డ్​ వాక్ ఫెస్టివల్

డిసెంబ‌ర్ 13 నుంచి కవ్వాల్​లో బర్డ్​ వాక్ ఫెస్టివల్

జన్నారం రూరల్, వెలుగు: కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ పరిధిలోని జన్నారం ఫారెస్ట్​ డివిజన్‌లో ఈ నెల 13 నుంచి 15 వరకు బర్డ్‌ వాక్‌ ఫెస్టివల్‌ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2022లో ఇక్కడ బర్డ్​వాక్​ ఫెస్టివల్ ​ప్రారంభించారు. గతంలో రెండు సార్లు ఫిబ్రవరిలో నిర్వహించగా.. మూడో ఫెస్టివల్​కు డిసెంబర్​లో ఏర్పాటు చేస్తున్నారు. గతంలో మహారాష్ట్ర, కాకినాడ, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి బర్డ్​ లవర్స్, ఫొటోగ్రాఫర్లు వచ్చారు. ఈసారి ఇంకా ఎక్కువ మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ముందుగా రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి
బర్డ్ వాక్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేవారు రూ.2వేలు చెల్లించి ముందుగానే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 13న బర్డ్‌ వాచర్ల పేర్లు నమోదు చేసుకుని సాయంత్రానికి రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒక గ్రూపు బర్తన్​పేట్‌ క్యాంపు, మరో గ్రూపు బైసన్‌కుంటలో రాత్రి బస చేసి 14న ఉదయం పక్షులను చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 14న రిజిస్ట్రేషన్​ చేసుకున్న వారు ఆ రోజు రాత్రి బస చేసి15న ఉదయం బర్డ్​వాక్​కు వెళ్తారు. సాయంత్రం గెట్​టుగెదర్ ​ఏర్పాటుచేసి వారి అనుభవాలను తెలుసుకుంటారు. డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్ ​తిరుపతికి 9441057771 ఫోన్‌ చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. వివరాలకు జన్నారం రేంజ్‌ ఆఫీసర్​ సుష్మారావు 9989591096, ఇందన్‌పల్లి రేంజ్‌ ఆఫీసర్​ కారం శ్రీనివాస్​ను 9618357086 సంప్రదించాలి.

300 జాతులకు పైగా పక్షులు
కవ్వాల్ టైగర్ జోన్​పరిధిలో 300 జాతులకు పైగా పక్షులున్నట్లు అధికారులు చెబుతున్నారు. కల్పకుంట, బైసన్‌కుంట, మైసమ్మకుంట ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాల్లో ఇవి ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. చలికాలంలో విదేశాల నుంచి, ఖండాంతరాల నుంచి వచ్చే పక్షులను కూడా ఇక్కడ చూడవచ్చు. బర్డ్​వాక్​లో భాగంగా పక్షుల్లో రకాలు, వాటి శాస్త్రీయ నామాల వివరా లతో ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు.