బీజేపీ @ 370 ..ఒక మానసిక యుద్ధం : ఐ.వి.మురళీకృష్ణ శర్మ

బీజేపీ @ 370 ..ఒక మానసిక యుద్ధం : ఐ.వి.మురళీకృష్ణ శర్మ

రాజకీయ యుద్ధంలో పట్టు సాధించాలంటే ‘ప్రత్యర్థులను మానసికంగా బలహీనపర్చాలి. వైరి వర్గంలో విభేదాలు సృష్టించాలి’ అని రాజనీతిజ్ఞుడు చాణక్యుడు చెప్పాడు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో  బీజేపీ ఇవే సూత్రాలను అనుసరిస్తోంది.  సొంతంగా 370కు పైగా, ఎన్‌‌‌‌డీఏ కూటమి 400కు పైగా ఎంపీ స్థానాలు సాధిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. వారు చెబుతున్నట్టు ఇన్ని స్థానాలు సాధించడం సాధ్యమా అని అధ్యయనం చేస్తే  ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బెతీయడమే బీజేపీ లక్ష్యంగా కనబడుతోంది.  ఆర్టికల్‌‌‌‌ 370 రద్దును  విజయవంతంగా  ప్రజల్లోకి తీసుకెళ్లిన బీజేపీ  అదే 370 సంఖ్యను  ఎన్నికల లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.

దేశం వెలిగిపోతుందని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ముందంజలో ఉందని ఆ పార్టీ పాజిటివ్‌‌‌‌  ప్రచారం చేసుకుంటోంది. వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయని ఆ పార్టీ ఇప్పటివరకు ఆరు విడతలుగా ప్రకటించిన లోక్‌‌‌‌సభ అభ్యర్థుల జాబితానే తేటతెల్లం చేస్తోంది. ఈ జాబితాలలో 405 మంది అభ్యర్థులను ప్రకటించగా, ఇందులో 209 సిట్టింగ్‌‌‌‌ ఎంపీలలో 103 మందికి వివిధ కారణాలతో తిరిగి టికెట్లు ఇవ్వలేదు. అంటే 34 శాతం మందికి మొండిచేయి చూపింది. మరోవైపు 2019లో  లక్ష నుంచి ఆరు లక్షల వరకు మెజార్టీ సాధించిన 39 మందిని పోటీకి దూరం చేసింది. ఇప్పటికే బలమైన రాష్ట్రాల్లో లక్ష్యసాధన పూర్తి చేసుకున్న బీజేపీ తన టార్గెట్‌‌‌‌ను  విజయవంతంగా  పూర్తిచేయాలంటే  బలహీనంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించాలి. 

అభ్యర్థులపై వ్యతిరేకత సాకు

బీజేపీ  ప్రచారం చేస్తున్నట్టు ఆ పార్టీకి దేశవ్యాప్తంగా సానుకూల పరిస్థితులే ఉంటే వంద మందికిపైగా టికెట్లను ఎందుకు నిరాకరించింది?  ప్రభుత్వ వ్యతిరేకతను అభ్యర్థుల వ్యతిరేకతగా మార్చివేసిందా? నిజంగా అభ్యర్థులపై వ్యతిరేకతనే  సాకుగా చూపితే అంత భారీగా మార్పులుంటాయా? అయోధ్య రామాలయం నిర్మాణం, కాశ్మీర్‌‌‌‌లో ఆర్టికల్‌‌‌‌ 370 రద్దు,  త్రిబుల్‌‌‌‌ తలాక్‌‌‌‌,  సీఏఏ చట్టం వంటి భావోద్వేగ అంశాలు  కొంత వరకు  ప్రయోజనాలు చేకూరుస్తున్నా..నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల వంటి అంశాలు ప్రతికూలంగా  ఉన్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మంగా అభ్యర్థుల మార్పులు చేస్తోంది. 2019 ఎన్నికల్లో  కూడా 282 సిట్టింగ్‌‌‌‌ ఎంపీలలో 119 అభ్యర్థులను అంటే 42 శాతం మందిని మార్చి విజయవంతం అయ్యింది. మళ్లీ ఇప్పుడు అదే ప్రయోగాన్ని చేస్తోంది. దేశంలోని ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో సున్నితమైన అంశాలు బీజేపీకి  మేలు చేకూరుస్తున్నాయి. అయితే, దక్షిణాది రాష్ట్రాల్లో అజెండా ఇందుకు భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్షిణాదిలో కీలకంగా మారనున్నాయి.

ఉత్తరాదితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో  వైఎస్‌‌‌‌ఆర్‌‌‌‌సీపీ, తమిళనాడులో  డీఎంకే,  కర్ణాటక,  తెలంగాణ  రాష్ట్రాల్లో కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు బీజేపీకి  సవాలు విసురుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కంటే దక్షిణాది రాష్ట్రాల్లో  రైతులకు  పథకాలు, మహిళలకు, వృద్ధులకు పెన్షన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు, ఉచిత విద్యుత్‌‌‌‌,  గ్యాస్‌‌‌‌  పథకాలతో ప్రజలు భారీగా ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ‘డబుల్‌‌‌‌ ఇంజిన్‌‌‌‌’  నినాదం కంటే ప్రభుత్వ పథకాలు అమలు ప్రధానంగా పేదలకు,  మధ్య తరగతి కుటుంబాలకు  చేరువయ్యాయి.

దక్షిణాదిపై ప్రత్యేక నజర్​

బీజేపీ 2019 ఎన్నికల్లో  సొంతంగా 303, ఎన్‌‌‌‌డీఏ కూటమిగా 353 స్థానాలతో గరిష్ట  ఫలితాలను సాధించింది. ఉత్తరప్రదేశ్‌‌‌‌ (64 స్థానాలు),  బిహార్‌‌‌‌ (39),  గుజరాత్‌‌‌‌ (26),  రాజస్థాన్‌‌‌‌ (25),  హర్యానా (10), ఢిల్లీ (7), ఉ త్తరాఖండ్‌‌‌‌ (5),  హిమాచల్‌‌‌‌ప్రదేశ్‌‌‌‌ (4),  మధ్యప్రదేశ్‌‌‌‌ (28),  జార్ఖండ్‌‌‌‌ (12),  అస్సాం (9), మహారాష్ట్ర (41),  ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌,   కర్ణాటక (26) రాష్ట్రాల్లో  సంతృప్తికరమైన ఫలితాలు పొందింది.

పశ్చిమబెంగాల్‌‌‌‌ (18),  ఒడిశా (8) రాష్ట్రాల్లో కూడా మెరుగైన స్థానాల్లో గెలిచింది. ఈ రాష్ట్రాల్లో  బీజేపీ  గరిష్ఠ  ఫలితాలను సాధించడంతో తన లక్ష్య సాధనకు ఇతర ప్రాంతాలలో ప్రధానంగా దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.  దక్షిణాది 2019లో ఆశించిన ఫలితాలు పొందలేకపోయిన బీజేపీ 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలకు వ్యూహాలను రచిస్తోంది. కర్నాటకలో గత ఎన్నికల్లో 25 సీట్లు సాధించిన బీజేపీ  ఈసారి  జేడీ(ఎస్‌‌‌‌)తో జతకట్టింది. ఆ రాష్ట్రంలో  అధికారంలో ఉన్న కాంగ్రెస్‌‌‌‌ అనేక ప్రజాకర్షణ పథకాలతో అధిక స్థానాలు గెలవడానికి ప్రయత్నిస్తుండగా మోదీ చరిష్మాతోపాటు  జేడీ(ఎస్‌‌‌‌) కూడా జతకట్టడంతో అన్ని సీట్లు గెలవాలని బీజేపీ చూస్తోంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌ గతానికి భిన్నంగా బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.

తెలంగాణలో కాంగ్రెస్–బీజేపీ మధ్యే పోటీ

గత ఎన్నికల్లో దక్షిణాదిలో కర్నాటక తర్వాత తెలంగాణలోనే బీజేపీ (4) సీట్లు సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండడంతో పార్టీ రోజురోజుకు బలహీనపడుతోంది. ఈ పరిణామాలతో  రాష్ట్రంలో ప్రధాన పోటీ కాంగ్రెస్‌‌‌‌– బీజేపీ మధ్యనే ఉండే అవకాశాలున్నాయి.

మోదీ చరిష్మాతో 2024లో  పది సీట్లు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.  కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌‌‌‌ ఆరు గ్యారంటీలపై ఆశలు పెట్టుకుంది.  కవిత అరెస్టు తమకు అనుకూలిస్తుందని బీజేపీ భావిస్తుంటే, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నిర్ణయాలపై చేపట్టిన విచారణలు తమకు అనుకూలిస్తాయని కాంగ్రెస్‌‌‌‌ భావిస్తోంది. తన ప్రభుత్వానికి లోక్‌‌‌‌సభ ఎన్నికలు రిఫరెండం అని ప్రకటించిన సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఎన్నికలను సవాలుగా తీసుకున్నారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ ఈ రాష్ట్రాల్లో వీలైనన్ని అధిక స్థానాలు పొందడానికి ప్రయత్నిస్తోంది.

2019లో ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో ఒంటరిగా పోటీ చేసిన  బీజేపీకి ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు.  రాష్ట్రంలో సంస్థాగతంగా  బలహీనంగా ఉన్న విషయాన్ని గమనించి బీజేపీ అధిష్టానం టీడీపీ, జనసేనతో పెట్టుకొని ఆరు లోక్‌‌‌‌సభ స్థానాల్లో  పోటీ చేస్తోంది.  పొత్తు పుణ్యమా అని వీటిలో సగం సీట్లు సాధించినా ఆ పార్టీకి బోనసే.  తమిళనాడులో గత ఎన్నికల్లో అన్నాడీఎంకేతో జతకట్టిన బీజేపీ ఇప్పుడు అన్నామలై నేతృత్వంలో ఎన్నికలను ఎదుర్కొంటుంది. అన్నామలై పాదయాత్రకు, మోదీ ర్యాలీలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతుండంతో బీజేపీ ఆ రాష్ట్రంపై గంపెడాశలు పెట్టుకుంది.  గత ఎన్నికల్లో 3.6 శాతం ఓట్లనే సాధించిన బీజేపీ ఈసారి ఎవరూ ఊహించని విధంగా సీట్లు సాధిస్తామనే ధీమాతో ఉంది.  ద్రావిడ రాష్ట్రంలో సంప్రదాయక పార్టీగా పేరు పొందిన బీజేపీ ఏమేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

కేరళలో  పాగా కోసం విఫలయత్నం

సగం  మైనార్టీల  జనాభా ఉన్న  కేరళలో  పాగా కోసం బీజేపీ కొన్ని సంవత్సరాలుగా విఫలయత్నం చేస్తోంది.  సంప్రదాయంగా ఇక్కడ కాంగ్రెస్‌‌‌‌,  వామపక్షాల పట్టు కొనసాగుతోంది. ‘ఇండియా’ కూటమిలో  కాంగ్రెస్‌‌‌‌తో పాటు  కీలక పాత్ర  పోషిస్తున్న  కమ్యూనిస్టులు  కేరళలో మాత్రం పరస్పరం తలపడుతున్నారు. ఇక్కడ ప్రత్యర్థులైన ఈ రెండు పార్టీలు  ఢిల్లీలో  దోస్తానా  చేస్తున్నాయంటూ మోదీ  కేరళలో  ప్రచారం చేస్తున్నారు.

రాష్ట్రంలో బీజేపీ 2019 ఎన్నికల్లో 13 శాతం ఓట్లు సాధించినా ఒక్క సీటు కూడా రాలేదు.  ఓట్ల శాతాన్ని సీట్లుగా మల్చుకోలేకపోతున్న  బీజేపీ ఈసారి ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ సహకారంతో  కేరళలో  కూడా  మెరుగైన  ఫలితాలను సాధిస్తామనే  విశ్వాసంతో ఉండగా, ముస్లిం,  క్రిస్టియన్లు  నిర్ణయాత్మకంగా ఉన్న రాష్ట్రంలో  బీజేపీ విజయవంతం కావడం సులభం కాదు.  

ఇప్పటికే  బలంగా ఉన్న రాష్ట్రాల్లో లక్ష్యసాధన పూర్తి చేసుకున్న బీజేపీ తన టార్గెట్‌‌‌‌ను  విజయవంతంగా  పూర్తిచేయాలంటే  బలహీనంగా ఉన్న  దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధిస్తేనే సాధ్యం. హ్యాట్రిక్‌‌‌‌  విజయంపై  కన్నేసిన  బీజేపీ  వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తోంది.  370 స్థానాలు టార్గెట్‌‌‌‌ అంటూ ప్రచారం చేస్తున్న  బీజేపీ  272  మ్యాజిక్‌‌‌‌  ఫిగర్‌‌‌‌ను సులభంగా అధిగమించి అధికారంలోకి రావడం ఖాయమనే వాతావరణాన్ని సృష్టించి  ప్రత్యర్థి  పార్టీలను ప్రధానంగా  కాంగ్రెస్‌‌‌‌ను  మానసికంగా  దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది.

 - ఐ.వి.మురళీకృష్ణ శర్మ,
రీసెర్చర్‌‌‌‌, పీపుల్స్‌‌‌‌పల్స్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ సంస్థ

 

  • Beta
Beta feature
  • Beta
Beta feature