కుత్బుల్లాపూర్ నుంచి బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర

కుత్బుల్లాపూర్ నుంచి బీజేపీ  ప్రజా సంగ్రామ యాత్ర
  • ఈ నెల 22న పెద్ద అంబర్‌‌‌‌పేటలో ముగింపు సభ

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం నుంచి ప్రారంభం కానుంది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం చిత్తారమ్మ గుడిలో ఉదయం 10 గంటలకు సంజయ్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత అక్కడే రాం లీల మైదానంలో పాదయాత్ర ప్రారంభ సభ జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర సంస్థాగత ఇన్‌‌చార్జ్‌‌ సునీల్ బన్సల్ హాజరుకానున్నారు.

ఈ నెల 22 వరకు మొత్తం 11 రోజులు 110 కిలోమీటర్లు బండి సంజయ్ నడవనున్నట్లు పాదయాత్ర కమిటీ కన్వీనర్‌‌‌‌ గొంగడి మనోహర్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా పాదయాత్ర రూట్ మ్యాప్‌‌ను పార్టీ నేతలు విడుదల చేశారు. ఈ యాత్రలో మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ కానున్నాయి. ఈ నెల 22న ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్ద అంబర్‌‌‌‌పేటలో పాదయాత్ర ముగింపు సభ జరగనుంది. పాదయాత్ర భద్రతపై ఇప్పటికే డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి రూట్ మ్యాప్‌‌ను పార్టీ నేతలు అందజేశారు. గత యాత్రల్లో జరిగిన ఘటనల దృష్టిలో పెట్టుకొని భద్రత కల్పించాలని డీజీపీని కోరారు.