పదేండ్ల నుంచి కేసీఆర్ మోసం చేస్తుండు : మిథున్ రెడ్డి

పదేండ్ల నుంచి కేసీఆర్ మోసం చేస్తుండు : మిథున్ రెడ్డి
  •  పాలమూరు​బీజేపీ క్యాండిడేట్​ఏపీ మిథున్ రెడ్డి

పాలమూరు/హన్వాడ, వెలుగు : కేసీఆర్​ పదేండ్ల నుంచి తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ వస్తున్నాడని మహబూబ్​నగర్  బీజేపీ అభ్యర్థి ఏపీ మిథున్​ రెడ్డి ఫైర్​ అయ్యారు. మహబూబ్​నగర్​ నియోజకవర్గంలోని కొనగట్టుపల్లి, అంబటోనిపల్లి, కిష్టంపల్లి, గొండియాల్, కొత్తగంజ్, గంజ్​ ప్రాంతాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడున్న మంత్రి సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

వీళ్లను మళ్లీ గెలిపిస్తే ఇండ్లల్లో ఆయన ఫొటో లేకుంటే రేషన్ కార్డు, పింఛన్ రాదని భయపెట్టిస్తాడన్నారు. చదువుకున్న యువకులు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటే, ఆ అప్లికేషన్ల మీదనే కేసీఆర్​ రూ.200  కోట్లు దండుకున్నాడని ఆరోపించారు. ఉద్యోగాల కోసం పరీక్షలు పెట్టి, పేపర్ లీకేజీలు చేస్తూ యువత జీవితాలతో ఆటలాడుకుంటున్నారని విమర్శించారు.

ఆదర్శ గ్రామంగా కొనగట్టుపల్లి గ్రామాన్ని ప్రకటించి కేంద్ర సర్కారు రూ.కోటి నిధులు ప్రకటించిందనే విషయాన్ని గుర్తు చేశారు. తనకు  ఓటు వేసి గెలిపిస్తే జితేందర్ రెడ్డి కొడుకుగా సేవ చేస్తానని తెలిపారు.