గాంధీ కుటుంబం కాదు జహంగీర్ల కుటుంబం : ఎంపీ ధర్మపురి అర్వింద్

గాంధీ కుటుంబం కాదు జహంగీర్ల కుటుంబం : ఎంపీ  ధర్మపురి అర్వింద్

నిజామాబాద్​, వెలుగు: గాంధీ పేరును చివర తగిలించుకున్న రాహుల్​గాంధీ, సోనియా గాంధీ ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్​ ఆరోపించారు. ఫెరోజ్​జహంగీర్​ మనవడైన రాహుల్​గాంధీకి.. గాంధీ పేరు ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. సెక్యులర్ ​పేరుతో కాంగ్రెస్​ దేశప్రజలను ఏండ్ల తరబడి మోసం చేస్తోందని విమర్శించారు. రాహుల్​గాంధీ కుటుంబీకులు జహంగీర్​లని ముమ్మాటికీ గాంధీలు కాదన్నారు. మంగళవారం ఆయన బీజేపీ నిజామాబాద్ జిల్లా పార్టీ ఆఫీసులో ​మీడియాతో మాట్లాడారు. 

ఫిరోజ్ జహంగీర్​ భార్య దివంగత ప్రధాని ఇందిరాగాంధీ దేశ ఎమర్జెన్సీ టైంలో రాజ్యాంగంలో సెక్యులర్​పదాన్ని చేర్చారన్నారు. రాజ్యాంగాన్ని ఎందుకు మార్చారో రాహుల్​సమాధానం చెప్పాలన్నారు. విద్యావ్యవస్థలో రిజర్వేషన్లు తొలగించిన ఘనత కాంగ్రెస్​దేనన్నారు. పదవీ వ్యామోహంతో దేశాన్ని పాకిస్థాన్, బంగ్లాదేశ్​గా ముక్కలు చేశారని ఆరోపించారు. ఓటు బ్యాంకు కోసం దేశ ప్రజల జీవితాలు నాశనం చేశారని, మత ప్రాతిపదికన అలీఘడ్, జామియా యూనివర్సిటీలు ఏర్పాటు చేసి వాటిలో ముస్లిం రిజర్వేషన్లు మాత్రమే అమలు చేస్తున్నారన్నారు.

 భవిష్యత్​లో ఉస్మానియా, హైదరాబాద్​ సెంట్రల్ ​యూనివర్సిటీల్లో ఈ విధానం వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదన్నారు. రోహ్యింగాలకు, బంగ్లాదేశీయులకు రిజర్వేషన్లు అడుగుతారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఆగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు పెంచారన్నారు. హిందూజాతి మేల్కొనకపోతే అన్యాయం జరుగుతుందన్నారు. అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్ ​సూర్యనారాయణ, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​ దినేశ్ ​కులాచారి, ఫ్లోర్​లీడర్​ స్రవంతిరెడ్డి, న్యాలం రాజు ఉన్నారు.