హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కమలం పువ్వు వాడిపోయింది. కనీస పోటీ ఇవ్వలేక కాషాయ పార్టీ చతికిలపడింది. ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కే అవకాశం కనిపించడం లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో ఏడు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ 19 వేల ఓట్ల మెజార్టీతో దూసుకుపోతుంది. కాంగ్రెస్ గెలుపు ఖాయం కావడంతో 5 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వెళ్లిపోయారు.
మరోవైపు.. గాంధీభవన్లో సంబరాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. డప్పులు వాయిస్తూ.. బాణా సంచా పేల్చి విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. రప్పా రప్పా, తగ్గేదేలే అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. బాణసంచా, బ్యాండ్ చప్పుళ్లతో గాంధీ భవన్ పరిసరాలు మార్మోగిపోతున్నాయి. మరోవైపు యూసఫ్ గూడలోని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నివాసం, కార్యాలయంలోనూ విజయోత్సవాలు షూరు అయ్యాయి. కాంగ్రెస్ శ్రేణులు, నవీన్ యాదవ్ అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.
