దేశం ముచ్చట తర్వాత... ముందు రాష్ట్రం సంగతి చూడు

దేశం ముచ్చట తర్వాత... ముందు రాష్ట్రం సంగతి  చూడు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. అడుగడుగునా ప్రశ్నిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ గడ్డపై కుటుంబ పాలనను ప్రజలు పాతర పెడుతారని తెలిపారు. సంవత్సరం తర్వాత.. మార్పు తప్పకుండా వస్తుందని.. అధికారులు తెలుసుకోవాలని.. చట్ట ప్రకారం పని చేయాలని వారికి సూచించారు. ఉన్న గద్దె ఊడిపోయే పరిస్థితి వచ్చిందని.. ఢిల్లీలో గద్దెనెక్కేది తర్వాత ఆలోచించాలన్నారు. అన్యాయంగా వ్యవహరిస్తే.. ప్రజలు క్షమించరన్నారు. బండి సంజయ్ నిర్విహిస్తున్న పాదయాత్రను ప్రజలు ఆదరిస్తున్నట్లు తెలిపారు. యాదాద్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నిర్వహిస్తున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు.

మాటలే తప్ప చేతల్లేవ్...
కేసీఆర్ సర్కార్ మాటలే తప్ప చేతల ప్రభుత్వం కాదని, అక్రమాలకు, అత్యాచారాలకు, దారుణాలకు ప్రతిరూపం ఈ ప్రభుత్వమని దుయ్యబట్టారు. అధికార దుర్వినియోగ ప్రభుత్వం ఏదైనా ఉందంటే..అది తెలంగాణ సర్కార్ అని విమర్శించారు. ధర్మాన్ని, న్నాయాన్ని పక్కన పెట్టి నా రాజ్యం అంటూ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. సామాజిక న్యాయం, సచివాలయం ఉందా అని ప్రశ్నించారు. దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారని.. వీరంతా ప్రజలను కలుస్తారని తెలిపారు. కానీ తెలంగాణ సీఎం మాత్రం ప్రజలను కలవరని వ్యాఖ్యానించారు. ఇక్కడ రైతులు నష్టపోతుంటే.. పంజాబ్ రాష్ట్రానికి వెళ్లి డబ్బులు ఇస్తారని విమర్శించారు. రైతుల దగ్గరి నుంచి వడ్లు కొంటున్నామంటూ ఊదరగొట్టి.. ఇప్పుడు మాట మార్చారన్నారు. రూ. 1300 ఎంఎస్ పీ ఉంటే.. ఏడు సంవత్సరాల్లో రూ. 2 వేల 060 చేశామని..రైతులకు మేలు జరగలేదా అని ప్రశ్నించారు.

కేంద్రం ఎన్నో నిధులు ఇస్తోంది...
ధాన్యం కొనుగోళ్ల విషయంలో, దళితుడిని ముఖ్యమంత్రి చేయడం..దళితులకు న్యాయం చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి.. ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని విమర్శించారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే హామీలిచ్చి అనంతరం మరిచిపోతారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అప్పులు చేశారో లెక్కలేదన్నారు. మజ్లిస్ పార్టీకి కీలుబొమ్మగా మారిందని.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అందుకే నిర్వహించడం లేదన్నారు. యూరియాకు రూ. 3,700 సబ్సిడీ ఇస్తున్నట్లు, గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తే..అవి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇస్తామని కేంద్రం చెబుతుంటే.. వారి డేటాను పంపించకపోవడం దారుణమన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకు రూ. 20 వేల కోట్లు కేటాయించి పనులు చేయిస్తున్నామన్నారు. అలాగే లక్షా 4 వేల కోట్లు జాతీయ రహదారుల కోసం ఖర్చు పెట్టినట్లు తెలిపారు. ఈ రోడ్లపై తెలంగాణ ప్రజలు తిరగడం లేదా ? అని ప్రశ్నించారు. భువనగిరిలో ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు.

కేంద్రాన్ని విమర్శించే స్థాయి లేదు...
రూ. 900 కోట్లతో నూతన భవనం నిర్మిస్తున్నట్లు.. త్వరలో శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. దీనిపై ఓ మంత్రి విమర్శలు చేస్తున్నారని.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. సనత్ నగర్ లో ఈఎస్ఐ మెడికల్ కాలేజీ రన్ చేస్తున్నట్లు.. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కు డబ్బులు కేటాయించడం లేదని విమర్శించారు. వరంగల్ లో రైల్వే కోచ్ పనులు ఆగిపోయాయని, రామగుండంలో యూరియా ఫ్యాక్టరీ పెడితే.. ప్రొడక్షన్ ఆపి వేయడం దారుణమన్నారు. ఇవన్నీ కేంద్రం చేస్తున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. టీఆర్ఎస్ లో ఉన్న వాళ్లందరూ స్వార్థపరులని, తెలంగాణ వద్దన్న వారు ప్రభుత్వంలో ఉన్నారని విమర్శించారు.  బీజేపీ పార్టీపై అబద్దపు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి ప్రభుత్వానికి లేదన్నారు.