హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి నష్టాల్లోకి నెట్టేశాయని, కేంద్ర ప్రభుత్వమే ఆ సంస్థను బలోపేతం చేస్తూ, కాపాడు తోందని బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. తమ ప్రయత్నాలతోనే తాడిచర్ల II బొగ్గు బ్లాక్ ను సాధించుకున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడం పూర్తిగా అవాస్తవమని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తాడిచర్ల IIను సింగరేణికి ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. బొగ్గు బ్లాక్ కేటాయింపు కేవలం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నాయకుల కృషితోనే సాధ్యమైనంద న్నారు.
ఇందుకు రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో రాంచందర్ రావు మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని తమ సొంత ప్రయోజనాల కోసమే వాడుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి నిధులను ఫుట్బాల్ మ్యాచ్లకు మళ్లిస్తూ సంస్థను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. మన్మోహన్ సింగ్ హయాంలో కోల్ స్కాం వెలుగుచూసిందని.. కానీ, ప్రధాని మోదీ నాయకత్వంలో పారదర్శకతకు పెద్దపీట వేశారని కొనియాడారు. రాష్ట్రంలో భూపరిపాలన అస్తవ్యస్తంగా మారిందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్లో భారీగా ఫేక్ అకౌంట్లు సృష్టించారని, వాటిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
