- రాజ్ఘాట్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రార్థన
- ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి గాంధీకి నివాళి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యేలు 40 మందిని కొని ఢిల్లీ సర్కారును కూల్చేందుకు బీజేపీ కుట్రచేస్తోందని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్ల చొప్పున మొత్తం రూ.800 కోట్లు పక్కన పెట్టుకుందని చెప్పారు. గురువారం తన ఇంట్లో జరిగిన పార్టీ సమావేశం తర్వాత ఎమ్మెల్యేలతో కలిసి ఆయన రాజ్ఘాట్కు వెళ్లారు. సమాధి వద్ద మహాత్ముడికి నివాళులు అర్పించి.. దేశంలో శాంతి నెలకొనేలా చూడాలని ప్రార్థించినట్లు కేజ్రీవాల్ చెప్పారు. తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. ‘ఒక్కో ఆప్ ఎమ్మెల్యేకు బీజేపీ రూ.20 కోట్లు ఆఫర్ చేసింది. రూ.800 కోట్లు సిద్ధంగా పెట్టుకుంది. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? జనం తెలుసుకోవాలని అనుకుంటున్నరు. ఈ డబ్బు జీఎస్టీదా..? లేదా పీఎం కేర్ ఫండ్స్ నుంచి తీశారా? లేకపోతే బీజేపీ లీడర్ల దోస్తులు ఇచ్చారా?” అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
53 మంది ఎమ్మెల్యేలు హాజరు
గురువారం కేజ్రీవాల్ ఇంట్లో జరిగిన మీటింగ్కు 53 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. పార్టీకి చెందిన 62 మంది ఎమ్మెల్యేలలో ఏడుగురు ఔట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారని చెప్పారు. సత్యేంద్ర జైన్ జైల్లో ఉండగా.. ఓఖ్లా ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ వర్చువల్గా పాల్గొన్నట్టు తెలిపారు. 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారన్న వార్తలో నిజంలేదని సౌరభ్ భరద్వాజ్ స్పష్టం చేశారు.