నలభై ఏండ్ల జర్నీలో భారతీయ జనతా పార్టీ అరుదైన రికార్డు సాధించింది. తన ప్రధాన ప్రత్యర్థి, గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కంటే ఎక్కువ మంది అభ్యర్థుల్నిబరిలోకి దింపింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 543 లోక్ సభ స్థానాలకు గానూ బీజేపీ సొంతగా 437 మందికి టికెట్లిచ్చింది. మిగిలిన 106 స్థానాల్లో ఎన్డీఏలోని ఇతర పార్టీలు పోటీచేస్తున్నాయి. అదే కాంగ్రెస్, ఈసారి సొంతగా 428 మంది క్యాండేట్లను ప్రకటించింది. మిగిలిన 115 సీట్లను యూపీఏభాగస్వాములకు వదిలేసింది. జాతీయ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ స్థానాల్లో పోటీకిదిగడం చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం. ఏడో దశఎన్నికలు జరిగే స్థానాలకు కాంగ్రెస్ మరో ఇద్దరుముగ్గురు అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థుల్నినిలబెట్టిన ఘనత మాత్రం ఇప్పటికీ బహుజన్ సమాజ్ పార్టీ పేరుమీదే ఉంది. 2014లో బీఎస్పీ మొత్తం 503మందికి టికెట్లిచ్చింది.
తెలుగు ఎఫెక్ట్ !
నిజానికి బీజేపీకి వివిధ రాష్ట్రాలకు చెందిన19 పార్టీలతో పొత్తున్నప్పటికీ, అభ్యర్థుల సంఖ్య కాంగ్రెస్ కంటే ఎక్కువ ఉండడానికి ప్రధాన కారణం తెలుగు రాష్ట్రాలే. గతంలో టీడీపీతో ప్రీపోల్ పొత్తు పెట్టుకున్న బీజేపీ, ఈసారి తెలంగాణలోని 17, ఆంధ్రప్రదేశ్ లోని 25స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.1980లో ఏర్పాటైన బీజేపీ, ఇందిరా గాంధీ హత్య తర్వాత(1984) జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రెండు స్థానాల్లో మాత్రమే గెలవడం, 1990నాటి ఎల్కే అద్వానీ రామ రధయాత్ర తర్వాత జరిగిన,(1991)ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 120 సీట్లు గెల్చుకుని ప్రధాన ప్రతిపక్షంగా మారడం తెలిసిందే. 1998లో నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్డీఏ) ఏర్పాటుతో, అప్పటివరకూ ఉనికిలేని ప్రాంతాలకు కూడా బీజేపీ విస్తరించింది.
ఎన్డీఏ పార్టీలేవి..
2019లో మొత్తం 19 పార్టీలు బీజేపీతో ప్రీపోల్ అలయెన్స్ పెట్టుకున్నాయి. మహారాష్ట్రలో శివసేన, తమిళనాడులో ఐఏఏడీఎంకే, డీఎండీకే, పీఎన్కే, తమిళ మానిల కాంగ్రెస్, ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్, పుటియ తమిళగన్ పార్టీలు, అస్సాంలో అస్సాం గణపరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్, పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్, బీహార్లో జనతాదళ్ యునైటెడ్, లోక్ జనశక్తి పార్టీ, కేరళలో భారత్ ధర్మ జనసేన, కేరళ కాంగ్రెస్(థామస్) పార్టీలు, ఉత్తరప్రదేశ్ లో అప్నాదళ్ , జార్ఖండ్ లో ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, నాగాలాండ్లో నేషనల్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ, రాజస్థాన్లో రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ ఎన్డీఏలో కొనసాగుతున్నాయి. కర్ణాటకలోని మాండ్య స్థానంలో ఇండిపెండెంట్అభ్యర్థి సుమలతకు మద్దతిచ్చింది.
యూపీఏ పార్టీలివే..
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తో పొత్తు చర్చలపై కిందా మీదా పడుతున్న కాంగ్రెస్ నిజానికి ఈ సారి పొత్తుల మాస్టర్గా నిలిచింది. 2019లో మొత్తం26 పార్టీలతో ప్రీపోల్ అలయెన్స్ కుదుర్చుకుంది. తమిళనాడులో డీఎంకే,వీసీకే, సీపీఎం, సీపీఐ, కేఎండీకే,ఎండీఎంకే పార్టీలు, మహారాష్ట్రలో ఎన్సీపీ, స్వాభిమాని పక్ష,బహుజన్ వికాస్ ఆగాధీ, యువస్వా భిమాన్ పార్టీ, బీహార్,జార్ఖండ్లో ఆర్జేడీ, హిందుస్థానీ ఆవామ్ మోర్చా, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ, జార్ఖండ్ వికాస్ మోర్చాపార్టీ లు, కేరళలో రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, కేరళ కాంగ్రెస్(ఎం), జమ్మూకశ్మీర్లో నేషనల్ ఫ్రంట్(ఎన్సీ), కర్ణాటకలో జేడీఎస్, ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రీయలోక్ దళ్ , జన అధికార్ పార్టీలు యూపీఏ భాగస్వాములుగా ఉన్నాయి. కాగా, సమాజ్ వాది పార్టీతో 4 స్థానాల్లో పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్, వరుణ్ గాంధీ పోటీచేస్తున్న ఫిలిబిత్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి సురేంద్రకుమార్ గుప్తాకు మద్దతు ఇస్తున్నది. మిజోరంలోనూ స్వతంత్ర్య అభ్యర్థిని బలపర్చింది.
బరిలో బీఎస్పీదే రికార్డు
1977లో పార్లమెంట్ స్థానాల సంఖ్య 489 నుంచి 543కు పెరిగింది. అప్పటి నుంచి 2019 దాకా లెక్కలు చూస్తే, సింగిల్ పార్టీగా ఎక్కువ మందిని పోటీకి దింపిన రికార్డు మాత్రం బీఎస్పీ పేరిట ఉంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీ మొత్తం 503 మందికి టికెట్లిచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే ఒక్కచోట కూడా గెలవలేదు.1989లో రాజీవ్గాంధీ నేతృత్వంలో హస్తం పార్టీమొత్తం 502 చోట్ల పోటీచేసి, 197 స్థానాల్లో గెలిచింది.
