- ఎన్వీ సుభాష్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్నిప్రమాదం యాదృచ్ఛికం కాదని, సాక్ష్యాలను మాయం చేసేందుకు జరిగిన పక్కా కుట్ర అని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆరోపించారు. అక్కడి ఫైళ్లు కాలిపోతే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకే లాభమని చెప్పారు. ఈ ఘటనపై న్యాయ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని, మున్సిపల్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. గత 52 ఏండ్లలో ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఫోరెన్సిక్ ల్యాబ్లో మంటలు ఎలా వచ్చాయని, డిజిటల్ సాక్ష్యాలు ఉండే ‘సీజర్ రూమ్’లోనే ప్రమాదం జరగడం యాదృచ్ఛికం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
