కమలంలో లోక్సభ లొల్లి

కమలంలో లోక్సభ లొల్లి
  •  క్యాండిడేట్లపై తెగని పంచాయితీ
  • ఎవరికి వారు తమకే అంటూ ప్రచారం
  • హాట్ కేకులా మల్కాజ్ గిరి  సీటు
  •  బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ పెట్టిన ఈటల
  •  ఇప్పటికే సెగ్మెంట్ లో మురళీధర్ రావు ప్రచార రథాలు
  • మహబూబ్ నగర్ లోనూ సేమ్ సీన్
  • జహీరాబాద్ బరిలో గులాబీ ఎంపీ?
  • ‘దిల్’బదల్ గయా అంటూ ప్రచారం

 హైదరాబాద్: బీజేపీలో లోక్ సభ టికెట్ల లొల్లి కొనసాగుతోంది. పలువురు లీడర్లు గీత దాటుతుండటం చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకొంటున్న పార్టీలో ఈ పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానం హాట్  స్పాట్ గా మారింది. ఈ స్థానం నుంచి తాను బరిలోకి దిగుతున్నట్టు మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెబుతున్నారు. ఈమేరకు ఇవాళ కార్యకర్తలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు.

ఈ సెగ్మెంట్ పై ఎప్పటి నుంచో కన్నేసిన మురళీధర్  రావు తన ప్రచార రథాలను తిప్పుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి పార్టీ టికెట్ ఇస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. మరో వైపు మహబూబ్ నగర్ టికెట్ విషయంలోనూ ఇద్దరు కీలక నేతల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ టికెట్ ను మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆశిస్తున్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా పాలమూరు సీటు కోసం పట్టుబట్టుతున్నారు. జహీరాబాద్ పార్లమెంటు స్థానం సైతం హాట్ టాపిక్ గా మారింది.

మొన్నటి వరకు నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సినీ నిర్మాత దిల్ రాజు బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. తాజాగా జహీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే కొత్త  టాక్ మొదలైంది. ఇదిలా ఉండగా ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ ఒకరు పోటీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. చీకోటి ప్రవీణ్  కూడా ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా జహీరాబాద్ క్యాండిడేట్ ను తానే నంటూ సంకేతాలు ఇస్తున్నారు.

ALSO READ :- ఆవుల పంపిణీలో 3 కోట్ల గోల్ మాల్!

నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్ , వరంగల్  ఎంపీ టికెట్ల కోసం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. ఇవాళ ఆదిలాబాద్ స్థానంపైనా చర్చ మొదలైంది. అభ్యర్థిక ఎంపిక విషయంలో తమ అభిప్రాయాలను  పరిగణనలోకి తీసుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు అధినాయకత్వానికి తెలిపారు. నాగర్ కర్నూల్ టికెట్ బీఆర్ఎస్ ఎంపీ రాములు కుమారుడు భరత్ కు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన రేపు కాషాయ కండువా కప్పుకొనే అవకాశం ఉంది.