అగర్తలా: లెఫ్ట్ పార్టీ లీడర్లు బీజీపీలో చేరాలని త్రిపుర సీఎం మాణిక్ సాహా కోరారు. తమ పార్టీ గంగా నది లాంటిదని, అందులో స్నానం చేయడం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయని అన్నారు. ఆదివారం సౌత్ త్రిపురలోని కక్రాబాన్లో నిర్వహించిన జన్ విశ్వాస్ ర్యాలీలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా గెలిచి తీరుతుందని చెప్పారు.
‘‘స్టాలిన్, లెనిన్ ఐడియాలజీ నమ్మేవాళ్లు బీజేపీలో చేరండి. ఎందుకంటే మా పార్టీ గంగా నదిలాంటిది. ఇందులో చేరితే మీ పాపాలన్ని తొలగిపోతాయి”అని చెప్పారు. రైలు కంపార్ట్మెంట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయని, వచ్చి ఖాళీగా ఉన్న బోగీల్లో కూర్చోవాలని కోరారు. ప్రధాని మోడీ మనందరం వెళ్లాల్సిన గమ్యానికి తీసుకెళ్తారని పేర్కొన్నారు. ప్రజల ప్రజాస్వామిక హక్కులను అణచివేసి ఏండ్ల తరబడి త్రిపురను కమ్యూనిస్ట్లు పాలించారని చెప్పారు.
