వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యం: MLA రాజాసింగ్‎పై బీజేపీ సీరియస్

వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యం: MLA రాజాసింగ్‎పై బీజేపీ సీరియస్

హైదరాబాద్: కమలం పార్టీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‎పై బీజేపీ సీరియస్ అయ్యింది. రాజా సింగ్ క్రమశిక్షణరాహిత్యం పరాకాష్టకు చేరిందని విమర్శించింది. గతంలో కూడా ఓ సారి సస్పెండ్ అయితే మళ్లీ పార్టీలోకి తీసుకున్నాం.. అయినా మళ్లీ అలాగే ప్రవర్తిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. బీజేపీకి వ్యక్తుల కంటే.. పార్టీనే ముఖ్యమని తేల్చి చెప్పింది. 

తెలంగాణలో బీజేపీ ఓడిపోవాలి అనుకునే నేతలు పార్టీలో ఎక్కువ అయ్యారని, పార్టీ అధ్యక్షుడిని ముందుగానే నిర్ణయించారని రాజాసింగ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేసింది. రాజాసింగ్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్‌కు లేఖ ఇవ్వాలని సూచించింది. బీజేపీ సభ్యత్వానికి రాజా సింగ్ రాజీనామా చేసిన లేఖను జాతీయ అధ్యక్షుడికి పంపిస్తున్నామని తెలిపింది.

ALSO READ | రాజాసింగ్ రాజీనామా: బీజేపీకి గుడ్ బై

కాగా, బీజేపీ సీనియర్ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొంత కాలంగా పార్టీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి వచ్చా.. కానీ నా అనుచరులను బెదిరించారని అసహనం వ్యక్తం చేశారు. బీజేపీకి రాజీనామా చేశానని.. రిజైన్ లెటర్‎ను కిషన్ రెడ్డికి అందజేశానని తెలిపారు. పార్టీ కోసం సర్వంధారపోసిన గుర్తింపు లేదని.. మీకో దండం మీపార్టీకో దండం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.