కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబంగా మారింది

కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబంగా మారింది

కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లోపాల వల్లే గోదావరి ముంపు ప్రాంతాల సంఖ్య పెరిగిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఇవాళ మంచిర్యాల పట్టణంలోని పలు కాలనీలు, గ్రామాల్లోని వరద ముంపు ప్రాంతాలను డీకే అరుణ సందర్శించారు. వరదలకు నష్టపోయిన బాధితులను ఆమె పరామర్శించారు. అనంతరం డీకే అరుణ మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబంగా మారిందని.. రాష్ట్ర ప్రజల బతుకులు మాత్రం మారలేదని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లాలో వరద ఉదృతి వల్ల 9వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆమె తెలిపారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు.. ముంపు ప్రాజెక్టుగా మారింది

ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఇంజనీర్ గా మారి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ముంపు ప్రాజెక్టుగా మారిందని డీకే అరుణ విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో రైతులకు సహాయం అందించి.. తెలంగాణ ప్రజలకు మాత్రం కన్నీళ్లు మిగిల్చిన సీఎంగా కేసీఆర్ చరిత్రలోకి ఎక్కాడు అని ఆమె వ్యాఖ్యానించారు. మంచిర్యాల జిల్లాలో వరద బాధితులకు భరోసా కల్పించే సమయం కూడా ముఖ్యమంత్రికి లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అన్న సందేహం ప్రజల్లో నెలకొందని ఎద్దేవా చేశారు. తక్షణమే వరద బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.