ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ మాట్లాడిన మాటలు అయన స్థాయిని దిగజార్చాయని బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు రైతు సమస్యల గురించి మాట్లాడిన ప్రతిపక్ష పార్టీ నాయకులను చిల్లర గాళ్లు, జోకర్లు,బఫూన్లు, సన్నాసులు అనడం సిగ్గు చేటని సీఎం పై మండి పడ్డారు. రాష్ట్ర ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక చౌకబారు మాటలు , అవహేళన మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ముఖ్య మంత్రి భాష తీరు ఇదేనా? అని ప్రశ్నించారు.
మంగళవారం జరిగిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ చెప్పిన మాటలన్నీ అబద్దాలేనని, గంట సేపు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడని ఆమె అన్నారు. రైతుల సమస్యలపై ఉన్న వాస్తవాలు మాట్లాడితే కేసీఆర్ కు కోపం వచ్చిందన్నారు. ప్రగతి భవన్ లో మీరు ఉన్నట్టు రైతులందరూ సుఖంగా లేరని, ధాన్యం కొనుగోలు సెంటర్ లలో రైతులు పడుతున్న ఇబ్బందులను ఒకసారి వెళ్లి చూడాలని ముఖ్యమంత్రిని ఉద్దేశించి అన్నారు . ధాన్యం నింపేందుకు సరిపోను గోనె సంచులు లేవని, లారీల ట్రాన్స్ పోర్టు సరిగ్గా లేదని అన్నారు. వానకు భయపడి ఆందోళన చెందుతున్న రైతులను.. ముఖ్యమంత్రి చిల్లరగాళ్లని అవమానిస్తారా? అంటూ ఫైర్ అయ్యారు.
“ప్రజల ఆరోగ్యం కంటే రాష్ట్ర ఖజానానే కేసీఆర్ కు ముఖ్యమా? రాష్ట్రంలో ఫించన్ , రైతు బంధు, జీతాలు ఇవ్వాలంటే లిక్కర్ ఆధాయమే మార్గమా?” అని అరుణ ప్రశ్నించారు. తాగండి, చావండి, ఖజానా నింపండి, అన్నట్లుగా కేసీఆర్ వైఖరి ఉందని ఆమె విమర్శించారు.