ముషీరాబాద్, వెలుగు: ఎయిర్ ఫోర్స్ లో 20 ఏండ్ల పాటు దేశ సేవ చేశానని.. ఇప్పుడు ప్రజా సేవ చేసేందుకు ముషీరాబాద్ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు బీజేపీ నేత డీఎస్ రెడ్డి తెలిపారు. శనివారం గాంధీనగర్ లోని తన ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశవ్యాప్తంగా సెక్యూరిటీ సర్వీసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నానని చెప్పారు. 25 ఏండ్లుగా సాయి గ్రూప్ ఎండీగా ఉంటూ దాదాపు 10 వేల మందికి సెక్యూరిటీ, బ్యూటీషియన్, టైలరింగ్ తదితర వృత్తుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించినట్లు తెలిపారు.
కరోనా సమయంలోనూ ఎంతో మందికి ఆర్థికంగా, వస్తు రూపంలో సహకారం అందించినట్లు ఆయన వివరించారు. బీజేపీ తరఫున ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు టికెట్ వస్తే జనం తనను ఆదరిస్తారనే ఆశాభావాన్ని డీఎస్ రెడ్డి వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.