
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు చిట్ చాట్
ఢిల్లీ: తెలంగాణలో రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ గడ్డురోజులు చూస్తుందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. తెలంగాణలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలపడంలో సీఎం కేసీఆర్ ఫెయిలయ్యారన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం కనిపించడం లేదన్నారు. కేసీఆర్ ఎవరికీ అందుబాటులో ఉండకపోవడమే ఆ పార్టీకి పెద్ద బలహీనత అన్నారు మురళీధర్ రావు.
టీడీపీని నేతలు వీడేది అందుకే
ఢిల్లీలో మీడియాతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహాలపై చిట్ చాట్ చేసిన మురళీధర్ రావు.. ఏపీలో టీడీపీకి భవిష్యత్తు లేదన్నారు. చంద్రబాబు కొడుకు లోకేశ్ పై పార్టీ నేతలు, క్యాడర్ కు నమ్మకం లేదన్నారు. టీడీపీ నేతలు ఆ పార్టీని అందుకే వీడి వెళ్ళిపోతున్నారన్నారు. చంద్రబాబు మునుపటిలాగా వెలగలేడనీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామే అన్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్నారు.
దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితి బీజేపీకి సవాల్ లాంటిదనీ.. ఆ సవాల్ ను త్వరలోనే అధిగమిస్తామని చెప్పారు. కశ్మీర్ లో కొత్త నాయకత్వం తయారు కాబోతోందన్నారు. కశ్మీర్ పరిస్థితి రోజు రోజుకు మెరుగవుతుందని చెప్పారు మురళీధర్ రావు.