కుచ్ ‘కరోనా’ భగవాన్  అంటున్న తెలంగాణ ప్రజలు

కుచ్ ‘కరోనా’ భగవాన్  అంటున్న తెలంగాణ ప్రజలు

వైద్యారోగ్య శాఖ సీఎం కేసీఆర్ చేతుల్లోకి వెళ్లడంతో.. తమను కాపాడాలంటూ తెలంగాణ ప్రజలు దేవుడిపై భారం వేశారని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. కరోనావైరస్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రస్తుత సమయంలో వైద్యారోగ్య శాఖ సీఎం కేసీఆర్ చేతుల్లోకి వెళ్లడంతో.. కుచ్ ‘కరోనా’ భగవాన్  అని తెలంగాణ ప్రజలు దేవుడిపైనే భారం వేశారని ఆమె అన్నారు. కరోనా నిబంధనలు పాటించకుండా కరోనా బారినపడిన వ్యక్తి చేతుల్లోకి ఆరోగ్య శాఖ వెళ్లడం దారుణమని ఆమె అన్నారు.

‘కారణాలు ఏవైనప్పటికీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సీఎం కేసిఆర్ గారి నిర్వహణలోకి వచ్చింది. ఈ పరిణామంతో రాష్ట్ర ప్రజలు ఇంకాస్త భీతిల్లిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఒక పక్క రాష్ట్రంలో కరోనా కట్టడి తీరుపై దాదాపు రోజువారీగా నడుస్తున్న విచారణలో పాలకులు హైకోర్టు ద్వారా మందలింపులు, హెచ్చరికలకు గురవుతున్నారు. ఇలాంటి దుస్థితిలో అసలు దర్శనం దొరకడమే కష్టంగా మారిన సీఎం గారి చేతికి వైద్య-ఆరోగ్య శాఖ వెళ్ళింది. స్వయంగా ఆయనే కరోనా నిబంధనలు ఉల్లంఘించి కోవిడ్ బారిన పడిన వ్యక్తి. ఆయనతో పాటు కుమారుడు, మంత్రి అయిన కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్... ఇలా గులాబీ దళం నేతలు చాలామంది కరోనాకు గురయ్యారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అత్యున్నత స్థాయి అధికారులకు సైతం అందుబాటులో ఉండని కేసీఆర్ చేతికి.... అది కూడా ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య, ఆరోగ్య శాఖ వెళ్ళడం ప్రజల్ని కలవరానికి గురిచేస్తోంది. ఇలాంటి ముఖ్యమంత్రి చేతుల్లో పడినందుకు కాపాడమంటూ.... కుచ్ "కరోనా" భగవాన్ అని తెలంగాణ ప్రజలు దేవుడిపైనే భారం మోపి కాలం వెళ్ళబుచ్చుతున్నారనేది ఇప్పుడు కనిపిస్తున్న కఠోర వాస్తవం’ అని విజయశాంతి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.