
కమీషన్ ఉంటేనే సీఎం కేసీఆర్ పనులు చేస్తారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మే 3వ తేదీ బుధవారం పెద్దపల్లి జిల్లాలో వివేక్ పర్యటించారు. సుల్తానాబాద్ మండలంలోని కనుకుల, రామునిపల్లే గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి, రైతులకు ధైర్యం చెప్పారు. ఎలాంటి కోతలు లేకుండా తడిసిన వడ్లను కోనాలని సంబంధిత అధికారితో వివేక్ ఫోన్ లో మాట్లాడారు. అధికారులు, ప్రభుత్వం సకాలంలో కొనుగోళ్లు జరపకపోవడంతోనే వర్షానికి వడ్లు తడిశాయని తమ గోడును వివేక్ వెంకటస్వామికి చెప్పుకున్నారు రైతులు.
అనంతరం వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆత్మీయ సమ్మేళనాలు చేసుకుంటోంది గానీ, రైతుల ఆవేదనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరి ధాన్యం ఎలా ఉన్నా కొంటామని ముఖ్యమంత్రి, మంత్రులు అంటున్నారు తప్ప అమలు చేయడం లేదని మండిపడ్డారు వివేక్. ప్రభుత్వం చెప్పినా మిల్లర్లు ధాన్యం కోనడం లేదంటే వారి మధ్య ఏదో ఒప్పందం ఉంటుందని వివేక్ వెంకటస్వామి అభిప్రాయపడ్డారు.
ఎకరానికి ఇరవై వేల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని వివేక్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టం వివరాలు కేంద్రానికి ఇవ్వడం లేదని.. ఇస్తే తాము కేంద్రం నుండి పరిహారం ఇప్పిస్తామని వివేక్ వెల్లడించారు. ప్రధాని ఫసల్ భీమా యోజన అమలు చేస్తే నష్టపోయిన రైతులకు కేంద్రం డబ్బులు ఇచ్చేదని తెలిపారు. ఫసల్ భీమా పథకం ఇతర రాష్ట్రాల్లో అమలవుతోందని, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయకుండా రైతులు నష్టపోయేలా చేసిందన్నారు వివేక్ వెంకటస్వామి.