
- ప్రాజెక్టు అద్భుతమంటూ ఈటల కితాబు
- అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని
- కిషన్ రెడ్డి, సంజయ్ డిమాండ్
- అయోమయంలో పార్టీ క్యాడర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ బీజేపీలో ‘కాళేశ్వరం కాక’ మొదలైంది. ఈ ప్రాజెక్టుపై ఆ పార్టీ నేతలు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. ప్రాజెక్టు అద్భుతమంటూ ఒకరు కితాబు ఇస్తుంటే, ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసి విచారణ చేయిస్తున్నది.
ఈ ప్రాజెక్టును మొదటి నుంచీ పలువురు బీజేపీ నేతలు తప్పు పడుతున్నారు. దీని నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని, అందువల్లే మేడిగడ్డ కుంగిందని ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో, రాష్ర్ట పర్యటనలకు వచ్చినప్పుడల్లా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ‘కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ఏటీఎంగా మారింది. దీన్ని అడ్డుపెట్టుకొని ఆ ఫ్యామిలీ వేల కోట్లు దోచుకుంది’ అని ఆరోపణలు చేశారు. కానీ ఇటీవల కమిషన్ ముందు హాజరైన బీజేపీ జాతీయ కమిటీ సభ్యుడు, ఎంపీ ఈటల రాజేందర్ మాత్రం ప్రాజెక్టును సమర్థిస్తూ మాట్లాడడంతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది.
ప్రాజెక్టును సమర్థించిన ఈటల..
నాడు టెక్నికల్, ఎక్స్పర్ట్కమిటీల నిర్ణయాల మేరకే కేసీఆర్ ముందుకెళ్లారని.. కేబినెట్సబ్ కమిటీ సూచనల మేరకు కేబినెట్ ఆమోదం పొందాకే బ్యారేజీలను నిర్మించారని కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల చెప్పారు. తుమ్మడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పినందునే సైట్ను మేడిగడ్డకు మార్చారని తెలిపారు. కానీ తుమ్మడిహెట్టి వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత ఉందని, సీడబ్ల్యూసీ నివేదికలో ఇదే విషయం ఉందని అప్పట్లో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారుగా ఉన్న వెదిరె శ్రీరామ్ చెప్పడం గమనార్హం. తాజాగా ఈటల వ్యాఖ్యలు దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. బ్యారేజీలకు కేబినెట్ ఆమోదమే లేదని నాడు మంత్రివర్గంలో ఉన్న తుమ్మల కూడా స్పష్టం చేయడంతో బీజేపీ నేతలు ఇరకాటంలో పడ్డారు. ఈటల ఒకవేళ కేసీఆర్ను కాపాడే ప్రయత్నం చేస్తే, అది తప్పేనని సొంత పార్టీ నేత కొండా విశ్వేశ్వర్రెడ్డి అదే రోజు పేర్కొన్నారు. మరోవైపు ఇటీవల ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని, దాని ద్వారా తెలంగాణకు 100 శాతం ప్రయోజనం ఉందని ఈటల పేర్కొన్నారు. కాళేశ్వరం ద్వారా 90 వేల ఎకరాలకే సాగునీరు అందిందని బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఇటీవల పేర్కొంటే.. ఈటల మాత్రం ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణ మొత్తం సస్యశ్యామలమైందని, వేసవిలో కూడా చెరువులు, వాగులు నిండాయని కొనియాడారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటల మాటలకు.. బీజేపీలోని ఇతర నేతల మాటలకు పొంతన లేకుండా పోయింది.
అక్రమాలు జరిగాయంటున్న కేంద్ర మంత్రులు..
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అక్రమాలు జరిగాయని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆ పార్టీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, లక్ష్మణ్, ధర్మపురి అర్వింద్ తదితరులు డిమాండ్ చేస్తున్నారు. దేశంలోనే కాళేశ్వరం అతిపెద్ద కుంభకోణమని, దీనిద్వారా రాష్ట్రానికి లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అయితే కాళేశ్వరం ప్రాజెక్టును ‘అతిపెద్ద ఇంజినీరింగ్ బ్లండర్’గా పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన అన్ని చర్చల్లో కేసీఆర్తో పాటు పాల్గొన్న వ్యక్తిగా దాని నిర్మాణం, నిర్వహణలో అనేక తప్పిదాలు జరిగాయని ఆయన స్పష్టం చేశారు.
ఈటల తీరుపై హైకమాండ్కు ఫిర్యాదు!
పార్టీలోని నేతలంతా కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే..ఈటల మరో రకంగా మాట్లాడడంతో బీజేపీ పెద్దలు ఇరకాటంలో పడ్డారు. దీంతో డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఈటల రాజేందర్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, అది బీజేపీ అభిప్రాయం కాదంటూ కొందరు నేతలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పార్టీలోని సీనియర్ నేతల మధ్య కాళేశ్వరం ప్రాజెక్టుపై భిన్నాభిప్రాయాలు బీజేపీ శ్రేణుల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఒకవైపు అవినీతిపై పోరాడుతున్నామని చెబుతూనే, మరోవైపు క్వాలిటీ లేక కుంగిపోయిన ప్రాజెక్టును సమర్థించడం కిందిస్థాయి నాయకులకు, కార్యకర్తలకు రుచించడం లేదు. ఈ అంతర్గత విభేదాలు రానున్న రోజుల్లో పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని నేతలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఈటల తీరుపై కొందరు బీజేపీ హైకమాండ్కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీనిపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.