సర్పంచుల నిధులు కొట్టేసిన దొంగ కేసీఆర్ : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

సర్పంచుల నిధులు కొట్టేసిన దొంగ కేసీఆర్ : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

సర్పంచుల నిధులు కొట్టేసిన దొంగ కేసీఆర్ అని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. కేంద్ర నిధులను రాష్ట్ర సర్కార్ దారి మళ్లిస్తోందని ఆరోపించారు. పంచాయతీ రాజ్ చట్టంపై హైదరాబాద్ లక్డికాపూల్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. గతంలో సర్పంచ్ లకు ఎంతో మర్యాద ఉండేదని.. ఇప్పుడు కనీస విలువ లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ తెచ్చిన రాజ్యాంగ సవరణలు అమలుకావట్లేదని కొండా వాపోయారు. కేసీఆర్ పాలనలో సర్పంచులు సెక్యూరిటీ గార్డు, వాచ్ మెన్లుగా పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి ఎవరో తనకు తెలియదని.. కేసీఆర్, కేటీఆర్ లే అన్ని శాఖలు చూస్తున్నారని విమర్శించారు. సర్పంచుల సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

రాజీనామా చేస్తే ప్రభుత్వమే దిగొస్తది : బూర

సర్పంచులు రాజీనామా చేస్తే ప్రభుత్వమే దిగొస్తుందని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. సర్పంచులు చిన్న తప్పులు చేస్తే కాళేశ్వరం స్కాంలాగా అధికారులు భావిస్తున్నారన్నారు. కొత్త మున్సిపల్, పంచాయతీ రాజ్ చలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రగతిభవన్ పెద్ద గడి అయితే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చిన్న గడి అని ఆరోపించారు. కేంద్ర నిధులు సర్పంచులకు అందకుండా కేసీఆర్ సర్కార్ దారిమళ్లించడం దుర్మార్గమన్నారు. స్థానిక సంస్థలను కేసీఆర్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. సర్పంచులను కేంద్రం దగ్గరికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.