ఇరిగేషన్​పై చర్చ జరుగుతుంటే పాపాత్ములు పారిపోయారు: బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్​

ఇరిగేషన్​పై చర్చ జరుగుతుంటే పాపాత్ములు పారిపోయారు: బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్​

 

  • బీఆర్​ఎస్​ సభ్యులపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్​  ఫైర్
  • కాళేశ్వరం ఎంక్వైరీ రిపోర్ట్​ను సభలో పెట్టాలి
  • కేసీఆర్, హరీశ్ రావును ప్రాసిక్యూట్ ​చేయాలి 
  • బీఆర్​ఎస్​ పాపం పండడం వల్లే ఎన్నికల్లో ప్రజలు శిక్షించారు.. అయినా వాళ్లకు బుద్ధిరాలేదని విమర్శ

హైదరాబాద్, వెలుగు: తుమ్మిడిహెట్టి దగ్గర రాక్​ఫౌండేషన్​ మీద కట్టాల్సిన ప్రాజెక్టును  మేడిగడ్డ లాంటి లూజ్​ సాయిల్​ మీద కట్టి, కూలేందుకు కారణమయ్యారని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుపై బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు మండిపడ్డారు. ఆ ఇద్దరినీ ప్రాసిక్యూట్​చేయాలని డిమాండ్​ చేశారు. ‘‘వీళ్ల పాపం పండడం వల్లే ఎన్నికల్లో ప్రజలు శిక్షించారు. అయినా వారికి బుద్ధిరాలేదు. ఎక్కడ తమ తప్పులు బయటపడ్తాయోనని ఇరిగేషన్​పై చర్చకు ముందే పాపాత్ములంతా(బీఆర్ఎస్ ​సభ్యులను ఉద్దేశించి) పారిపోయారు” అని వ్యాఖ్యానించారు. 

బుధవారం అసెంబ్లీలో వివిధ పద్దులపై  జరిగిన చర్చలో భాగంగా పాల్వాయి హరీశ్​ మాట్లాడారు.  ‘‘కాళేశ్వరం లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్టుపై మనం తప్పకుండా మాట్లాడాలి.. వీళ్లుంటే బాగుండు, కానీ ఈ పాపాత్ములు తప్పించుకుని పోయారు. ఈ శతాబ్దపు అతిపెద్ద ఇంజినీరింగ్​ తప్పిదం కాళేశ్వరం.  కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ రిపోర్ట్​ను శాసనసభలో పెట్టాలి.ఏడో బ్లాక్​ కుంగిపోతే రిపేర్​ చేస్తే పక్కనే ఉన్న ఇంకో బ్లాక్​ కుంగదనే నమ్మకమేంది? వాళ్లు కట్టిందే లూజ్​ సాయిల్​మీద..  మా దగ్గర తుమ్మిడిహెట్టి దగ్గర రాక్ ​ఫౌండేషన్​ మీద కట్టాల్సిన ప్రాజెక్టును తీసుకుపోయి ఈ పాపాత్ములు అక్కడ కాళేశ్వరం దగ్గర లూజ్​ ఫౌండేషన్ మీద కడ్తే ఎలక్షన్​ముందే కుంగింది’’ అని అన్నారు. 

కారకులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని పాల్వాయి హరీశ్​బాబు డిమాండ్​ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్, హరీశ్ రావును క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయడంతోపాటు, ఎల్ అండ్ టీ కాంట్రాక్టర్ పైనా చర్యలు తీసుకోవాలని కోరారు.