యాదాద్రి పర్యటనలో నిన్న సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరుపై రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రాహుల్ గాంధీ పుట్టుకపై అస్సాం సీఎం తప్పుగా మాట్లాడడం సంస్కారం కాదు. ఆయన మాట్లాడిన తీరుకు నా కండ్లలో నీళ్లు తిరిగినయ్. బీజేపీ సంస్కారమిదేనా? తక్షణం అస్సాం సీఎంను బర్తరఫ్ చేయాలి’ అంటూ సీఎం కేసీఆర్ నిన్న డిమాండ్ చేశారు. దీనిపై ఇవాళ హైదరాబాద్ లోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. పొత్తుల కోసమే సీఎం కేసీఆర్ పాకులాట అని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీపై కాంగ్రెస్ పార్టీ వాళ్ల కంటే సీఎం కేసీఆరే గొప్పగా సానుభూతి చూపిస్తున్నారని అన్నారు. మరి సోనియా గాంధీ, చంద్రబాబు లాంటి వాళ్లు.. ప్రధాని నరేంద్ర మోడీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కేసీఆర్ కండ్లలో నీళ్లెందుకు రాలేదని ప్రశ్నించారు. భాష గురించి కేసీఆర్ మాట్లాడటం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని రఘునందన్ అన్నారు.
రాబోయే ఎన్నికల్లో ఆ రెండు పార్టీల పొత్తు
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలసి పోటీచేయబోతున్నాయని రఘునందన్ రావు అన్నారు. భైంసాలో హిందువులపై దాడులు జరిగితే మాట్లాడని కేసీఆర్.. ఇప్పుడు కొత్తగా మత రాజకీయాల మాటెత్తడం సిగ్గుచేటన్నారు. పాతబస్తీలో హిందూ సమాజానికి జరిగిన నష్టంపై కేసీఆర్ తో చర్చకు బీజేపీ సిద్ధమని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని అన్నారు.