లిక్కర్ స్కాంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ రావు, రామచంద్ర పిళ్లైతో కలిసి కేసీఆర్ పుట్టిన రోజున కవిత తిరుమల వెళ్లారని రఘునందన్ రావు ఆరోపించారు. దానికి సంబంధించిన ఫొటోను ఆయన మీడియాకు చూపించారు. పిళ్లై కంపెనీల్లో కవిత డైరెక్టర్ గా ఉన్నారని పలు పేపర్లలో వచ్చిన కథనాల్లో ఉందని చెప్పారు. లిక్కర్ స్కాంతో తనకు సంబంధం లేదన్న కవిత.. వారితో కలిసి వెళ్లడం అబద్దమా అని ప్రశ్నించారు. దీనికి సంబంధించి పేపర్ లో వచ్చిన ఆర్టికల్ పై ఆమె సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
లిక్కర్ స్కామ్ లో ఈడీ సోదాలు
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో సోదాలు చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ కోకాపేట్, నానక్రామ్గూడలోని రెండు ప్రాంతాల్లో 15 మంది అధికారుల ఈడీ టీమ్ సెర్చ్ చేసింది. కోకాపేట్లోని అరుణ్ రామచంద్రన్ పిళ్లై ఫ్లాట్తోపాటు బెంగళూరు, ఢిల్లీ, లక్నో, గుర్గావ్, నోయిడాలో ఏకకాలంలో దాడులు జరిపింది. సీబీఐ సేకరించిన డాక్యుమెంట్స్ ఆధారంగా మనీల్యాండరింగ్పై ఆధారాలు సేకరిస్తున్నది. రాష్ట్రానికి చెందిన ఓ నేత మాజీ పీఏ, అనుచరుల ఇండ్లు, ఆఫీసుల్లో సోదాలు జరిగినట్లు ప్రచారం జరిగినప్పటికీ ఈడీ అధికారులు మాత్రం ధ్రువీకరించలేదు. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు ముగిసిన తర్వాత వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.
రిజిస్టర్డ్ అడ్రస్లో కంపెనీలు, ఆఫీస్లు లేవు
నానక్ రామ్గూడలోని సోహిన్టెక్ పార్క్, సికింద్రాబాద్ క్లాక్ టవర్ సమీపంలోని నవకేతన్ కాంప్లెక్స్ అడ్రెస్లతో ఓ డిస్టిలరీ కంపెనీ రిజిస్టరైంది. అరుణ్ పిళ్లై మెయిల్ ఐడీతో లింకైన వీటి నుంచే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్లు చేతులు మారినట్లు సీబీఐ ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు నానక్రామ్గూడలో సెర్చ్ చేశారు. సికింద్రాబాద్ నవకేతన్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్లోని ఫ్లాట్ నంబర్ 120, 128 షాపుల పేరుతో ఓ డిస్టిలరీ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ రిజిస్టర్ అయినా.. అక్కడ బ్యూటీ పార్లర్స్ మినహా ఎలాంటి ఆఫీస్లు లేకపోవడంతో కంపెనీ రిజిస్ట్రేషన్స్పై ఫోకస్ పెట్టారు. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ద్వారా ఆయా కంపెనీలను రిజిస్టర్ చేసిన వ్యక్తులకు సంబంధించిన వివరాలు రాబడుతున్నారు.
లిక్కర్ టెండర్స్ డీలింగ్లో సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చిన ఓ ప్రముఖ నేతకు చెందిన మాజీ పీఏ ఈ స్కామ్లో చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతున్నది. అరుణ్ పిళ్లై, ఢిల్లీ లిక్కర్ పాలసీకి చెందిన పెద్దలతో హైదరాబాద్కు చెందిన అభిషేక్ రావుకు డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నట్లు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. అరుణ్ పిళ్లై, ఇండోస్పిరిట్కు చెందిన సమీర్ మహేంద్రుకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించాయి. సమారు రూ.4 కోట్లకు సంబంధించిన వ్యవహారంలో అరుణ్ పాండ్యా అనే వ్యక్తి మీడియేటర్గా వ్యవహరించినట్లు సీబీఐ ఆధారాలు సేకరించింది. నానక్రామ్గూడ సోహిన్టెక్ పార్క్లో రిజిస్టర్ అయిన ఓ డిస్టిలరీ కంపెనీతో సృజన్, ప్రేమ్సాగర్ అనే వ్యక్తులకు సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. పలు స్పిరిట్ కంపెనీలతో రాష్ట్ర నేతలకు ఉన్న సంబంధాలపై ఈడీ ఫోకస్ పెట్టినట్లు సమాచారం.