అబద్ధాలు చెప్పడం కల్వకుంట్ల ఫ్యామిలీకి అలవాటే: లక్ష్మణ్‌‌

అబద్ధాలు చెప్పడం కల్వకుంట్ల ఫ్యామిలీకి అలవాటే: లక్ష్మణ్‌‌
  • అవసరాల కోసం పక్కదారులు తొక్కే పార్టీ: లక్ష్మణ్‌‌
  • బీఆర్‌‌‌‌ఎస్‌‌తో బీజేపీ పొత్తు ప్రచారం అవాస్తవం 

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌ఎస్‌‌కు బీజేపీ మద్దతిస్తుందని 2018లో తాను చెప్పినట్లు మంత్రి కేటీఆర్ అన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. అది అవాస్తవమని, దురుద్దేశంతోనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని. ఇది నీతిమాలిన, సిగ్గులేని చర్య అని మండిపడ్డారు. బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్పడం కల్వకుంట్ల కుటుంబానికి అలవాటే అని బుధవారం ట్విట్టర్‌‌‌‌లో ఆయన ఫైర్ అయ్యారు. 

బీజేపీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ఓటమి భయంతో తమ పార్టీపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. తప్పులను ఎత్తిచూపి మాట్లాడితే, బట్టకాల్చి మీద వేస్తున్నారన్నారు. నకిలీ హామీలు, వెకిలి చేష్టలు, అబద్ధపు ప్రచారాలు.. కేసీఆర్ ఫ్యామిలీకి, బీఆర్ఎస్ నాయకులకు పరిపాటేనన్నారు. బీజేపీ ఒక సిద్ధాంతానికి కట్టుబడి ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకునే పార్టీ అని, బీఆర్ఎస్ అవసరాల కోసం పక్కదారులు తొక్కే పార్టీ ఆరోపించారు. 

అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను కుటుంబ పాలనతో కేసీఆర్‌‌‌‌ కబ్జా చేశారని లక్ష్మణ్‌‌ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ పొత్తులతోనే కాలం వెల్లదీసిందని విమర్శించారు. ‘‘ప్రతి ఎన్నికల్లో పలు పార్టీలతో తెరచాటు ఒప్పందాలు, పొత్తులు పెట్టుకున్న బీఆర్ఎస్‌‌కి బీజేపీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. వారసత్వ రాజకీయాలతో సంబంధం ఉన్న ఏ పార్టీని కూడా బీజేపీ ప్రోత్సహించదు.. దరిచేరనివ్వదు”అని లక్ష్మణ్ పేర్కొన్నారు.