రాజాసింగ్ ,బండి సంజయ్ లు హింస ను ప్రేరేపిస్తున్నారు

రాజాసింగ్ ,బండి సంజయ్ లు హింస ను ప్రేరేపిస్తున్నారు

తెలంగాణ లో జరిగే ప్రతి చిన్న విషయానికి బీజేపీ నేతలు మతం రంగు పులుముతున్నారని ఆరోపించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. గత వారం రోజులుగా బీజేపీ నేతలు భాద్యత లేకుండా ఇష్టాను సారం మాట్లాడుతున్నారన్నారు. ప్రెస్ మీట్ లో మాట్లాడిన కర్నె… రాజాసింగ్,బండి సంజయ్ లు హింసను ప్రేరేపిస్తూ రాజకీయలబ్దికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నాలుగు ఎంపీ సీట్లు గెలవగానే బీజేపీ నేతలు వాపు ను చూసి బలం అనుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా తెలంగాణ ప్రజలు  TRS వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. అసెంబ్లీ ,మండల ,జడ్పీ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోయిందని గుర్తు చేశారు.

బీజేపీ ఎంపీ లు భాద్యతాయుతమైన పదవుల్లో ఉంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ అల్లర్లను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు కర్నె. ఆదిలాబాద్ లాంటి ప్రశాంతమైన జిల్లాలోనూ ఎంపీ సోయం బాపు రావు వర్గాల మద్య కొట్లాట పెడుతున్నారని చెప్పారు. ఓ వర్గం తలలు నరుకుతామంటూ బాపు రావు చేసిన వ్యాఖ్యల ను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.. బాపు రావు తో క్షమాపణ చెప్పించాలన్నారు. తెలంగాణ లో మత రాజకీయాలకు స్థానం లేదన్న కర్నె.. బీజేపీ పశ్చిమ బెంగాల్ లో చేసినట్టు ఇక్కడ చేస్తామంటే కుదరదన్నారు. తెలంగాణ చైతన్య వంతమైన ప్రాంతమని..బీజేపీ ఆటలు సాగవన్నారు. అంతేకాదు బీజేపీ నేతలు ఎన్ని యాత్రలు చేసినా తెలంగాణ లో నిరాశ తప్పదని చెప్పారు కర్నె.