ఆ రెండు పార్టీలు ఒక్కటే

ఆ రెండు పార్టీలు ఒక్కటే

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్  డైరెక్షన్​లోనే కాంగ్రెస్ పనిచేస్తోందని, ఆ రెండు పార్టీలు ఒకే తాను ముక్కలు అని బీజేపీ స్టేట్​ ప్రెసిడెంట్, ఎంపీ బండి సంజయ్​ ఆరోపించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరు కాదని.. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఒకే అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమాలు చేస్తున్న రోజుల్లోనే కాంగ్రెస్  కూడా అదే పనిగా కార్యక్రమాలు చేపట్టడం సిగ్గు చేటని ప్రకటనలో విమర్శించారు. బీజేపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూడలేక ఇటు సీఎం కేసీఆర్... అటు కాంగ్రెస్ లీడర్లు ప్రోగ్రామ్స్​ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న గ్రాఫ్​ను తగ్గించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో బీజేపీ పక్షాన నిరుద్యోగ దీక్ష చేపట్టిన రోజే కాంగ్రెస్ సైతం కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు. నిర్మల్ లో బీజేపీ బహిరంగ సభ  నిర్వహించిన రోజే కాంగ్రెస్ గజ్వేల్ లో పోటీగా సభ ఏర్పాటు చేసిందని తెలిపారు. మహబూబ్ నగర్ లో బీజేపీ సభ నిర్వహించిన రోజే పీసీసీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. తాజాగా బీజేపీ తెలంగాణ శాఖ 3వ విడత ప్రజా సంగ్రామ యాత్రను ఆగస్టు 2న ప్రారంభించాలని నిర్ణయిస్తే... అదే రోజున కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లలో రాహుల్ గాంధీతో సభ నిర్వహించేందుకు సిద్ధం అవుతోందని పేర్కొన్నారు.

ఇలా ఏడాది కాలంలో ప్రజల పక్షాన బీజేపీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన చాలాసార్లు పోటీగా కాంగ్రెస్ కార్యక్రమాలు నిర్వహించిందని వివరించారు. ఇది ముమ్మాటికీ సీఎం కేసీఆర్ డైరెక్షన్ లోనే కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాగా భావిస్తున్నామని తెలిపారు. గతంలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు చేసిన ఆందోళనలకు కాంగ్రెస్ చాలాసార్లు మద్దతు ఇచ్చిన సందర్భాలున్నాయని వివరించారు.  2004 ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసే పోటీ చేశాయని, ఆ తరువాత ప్రభుత్వంలోనూ భాగస్వాములైనట్లు పేర్కొన్నారు.  రాబోయే ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కలిసే పోటీ చేయబోతున్నారని తెలిపారు. ఇరు పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కూడా కుదిరినట్టు పేర్కొన్నారు. టీఆర్​ఎస్​, కాంగ్రెస్​ కుట్రలను అర్థం చేసుకుని తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.