ప్రగతి భవన్ కనుసన్నల్లోనే పేపర్ లీకేజీ..బీజేవైఎం ఆరోపణ

ప్రగతి భవన్ కనుసన్నల్లోనే పేపర్ లీకేజీ..బీజేవైఎం ఆరోపణ

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ దగ్గర బీభత్సం చేశారు బీజేపీ విద్యార్థి సంఘాలు. ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చినట్లే ఇచ్చి.. పేపర్లు లీక్ చేసి అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారంటూ భగ్గుమన్నారు స్టూడెంట్స్. ఎగ్జామ్ పేపర్లను అమ్ముకుంటూ.. నిరుద్యోగులను దారుణంగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు ఆందోళనకారులు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ బోర్డును పీకేశారు.. గేట్లు దూకారు.. ఆఫీసులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో.. ఆందోళనకారులను బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్లారు పోలీసులు.

సంవత్సరాల తరబడి కష్టపడి చదువుతుంటే.. పేపర్లు లీక్ చేసి మోసం చేస్తున్నారని.. అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు స్టూడెంట్స్. పేపర్ లీకేజీలు ప్రగతిభవన్ డైరెక్షన్ లో జరుగుతున్నాయంటూ ఆరోపించారు.. ఇంజినీరింగ్ విభాగంలోని టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్ పేపర్ లీక్ తరహాలోనే.. గ్రూప్ వన్, ఇతర కాంపిటీషన్ ఎగ్జామ్స్ పేపర్లు కూడా లీక్ చేసి ఉంటారనే అనుమానాలను సైతం వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్ యూనియన్ లీడర్స్.

పేపర్ కాపాడుకోలేకపోతే ఎందుకు..?

పరీక్షల పేపర్లును కాపాడుకోకపోతే టీఎస్పీఎస్సీ బోర్డు ఎందుకని ప్రశ్నించారు. ప్రగతి భవన్ కను సన్నల్లోనే టీఎస్పీఎస్సీలో పేపర్ లీకైందని ఆరోపించారు. ఈ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న  బీజేపీ విద్యార్థుల సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా లాక్కెళ్లారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.