అధికారంలోకి వచ్చేది బీజేపీనే: డీకే అరుణ

అధికారంలోకి వచ్చేది బీజేపీనే: డీకే అరుణ

జాతీయ ఉపాధ్యక్షురాలి బాధ్యతలిచ్చినా.. తెలంగాణపైనే ఎక్కువ ఫోకస్: డీకే అరుణ

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కేంద్రంతోపాటు..  తెలంగాణ రాష్ట్రంలోనూ బీజేపీనే అధికారంలోకి వస్తుందని బీజేపీ మహిళా నేత, మాజీ మంత్రి డీకే అరుణ పేర్కొన్నారు. కొత్త జాతీయ కార్యవర్గంలో తనను బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధ్యక్షురాలిగా బాధ్యత ఇచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తన పై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తానని.. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు .

కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని ఆమె పేర్కొన్నారు.  తెలంగాణ ప్రజలు దేని కోసం అయితే పోరాడారో.. పాలన ఎలా ఉడాలో..  ఎందుకు తెలంగాణ రావాలని కోరుకున్నారో అది నెరావేరాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ నే… వికసించేది కమలమేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న పోరాటంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. తనకు జాతీయ స్థాయి బాధ్యతలు అప్పగించినా ఫోకస్ మాత్రం రాష్ట్రము పైనే ఎక్కువగా  ఉంటుందని ఆమె తెలిపారు.