ఐటీ కారిడార్​లో బీజేపీ బోణీ

ఐటీ కారిడార్​లో బీజేపీ బోణీ

కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ లో ఒక్కో డివిజన్లో గెలుపు
మూడు చోట్ల సిట్టింగ్‌లను ఓడించిన బీజేపీ క్యాండిడేట్లు

కూకట్ పల్లి, వెలుగు: ఐటీ కారిడార్, సెటిలర్స్ ఉండే కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఓటర్లంతా టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపినప్పటికీ…ఈ మూడు నియోజకవర్గాల్లో ఒక్కో డివిజన్ లో బీజేపీ క్యాండిడేట్లు తమ సత్తా చాటారు. టీఆర్ఎస్ కు అనుకూల వాతావారణం ఉన్న చోట బీజేపీ ఉనికి చాటారు. మూడు డివిజన్లలో సిట్టింగ్ టీఆర్ఎస్ క్యాండిడేట్లను ఓడించారు. కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని మూసాపేట, కుత్బుల్లాపూర్​ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల, శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలి డివిజన్లలో బీజేపీ క్యాండిడేట్లు గెలిచారు. మూసాపేట బీజేపీ తరఫున గెలిచిన కె. మహేందర్ పార్టీలో ఓ సాధారాణ కార్యకర్త. ఎన్నికల్లో పోటీ చేసే వరకు కూడా ఆయన పేరు ఎక్కువ మందికి తెలియదు. అయినప్పటికీ పార్టీకి మహేందర్ చేసిన సేవను దృష్టిలో పెట్టుకొని ఆయనకు టికెట్ ఇచ్చారు. ఇక్కడ సిట్టింగ్ టీఆర్ఎస్ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ ను ఓడించి  బీజేపీకి కొత్త జోష్ తెచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల నుంచి గెలిచిన తారాచాంద్రారెడ్డి మొదటి నుంచి బీజేపీ తోనే ఉన్నారు. ఆమె భర్త చంద్రారెడ్డి 3 దశాబ్దాల క్రితమే బీజేపీ లో క్రియాశీలకంగా పనిచేశారు. అప్పట్లో ఆయన హత్యకు గురవడంతో  తారాచాంద్రారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ కుటుంబం సేవలను గుర్తించి పార్టీ టికెట్ ఇవ్వటంతో టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ పద్మప్రతాప్ గౌడ్ పై గెలిచి సత్తా చాటారు. శేరిలింగంపల్లి లోని గచ్చిబౌలి డివిజన్ లో బీజేపీ క్యాండిడేట్ గా బరిలోకి దిగిన గంగారెడ్డి ఇక్కడి సిట్టింగ్ టీఆర్ఎస్ కార్పొరేటర్ సాయిబాబాను ఓడించారు. శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కు శిష్యుడైన గంగాధర్ ఆయనతో పాటు ఇటీవల బీజేపీలో చేరారు. ఇక్కడ బీజేపీ గెలవటంతో ఐటీ కారిడార్ గచ్చిబౌలిలో బీజేపీ కి కొత్త జోష్ వచ్చింది.

For More News..

గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో కరోనా కలకలం

మరో 2 నెలలు పాత పాలక మండలే