రాజాసింగ్​పై సస్పెన్షన్ ఎత్తివేత!

రాజాసింగ్​పై సస్పెన్షన్ ఎత్తివేత!

ఇయ్యాలో రేపో బీజేపీ హైకమాండ్ ప్రకటన

న్యాయ సాయం అందించేందుకూ సానుకూలం

హైదరాబాద్, వెలుగు: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ ఎత్తేసేందుకు బీజేపీ జాతీయ క్రమశిక్షణ సంఘం సానుకూలత వ్యక్తం చేసినట్లు పార్టీ రాష్ట్ర వర్గాలు చెబుతున్నాయి. రెండు, మూడు రోజుల్లో ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ హైకమాండ్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు పార్టీ నేత ఒకరు చెప్పారు. రెండు రోజుల కిందటే రాజాసింగ్ భార్య ఉషాబాయీ బీజేపీ స్టేట్ ఆఫీసుకు వచ్చి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ని కలిసి దీనిపై చర్చించి వెళ్లారు. సస్పెన్షన్ పై బీజేపీ షోకాజ్ నోటీసు ఇవ్వగా.. దీనికి రాజాసింగ్ ఇది వరకే వివరణ ఇస్తూ లేఖ రాశారు. దీనిపై క్రమశిక్షణ సంఘం సంతృప్తిని వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కమెడియన్ మునావర్ ఫారుఖీపై తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూనే.. మహ్మద్ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు ఏమీ చేయలేదని, పైగా హిందూ ధర్మ రక్షణ కోసం తాను పోరాడుతున్నందుకు ఎంఐఎం, టీఆర్ఎస్ కుట్ర పన్ని తనపై తప్పుడు కేసులు బనాయించాయని రాజాసింగ్ క్రమశిక్షణ సంఘానికి ఇచ్చిన వివరణలో పేర్కొన్నారు.

న్యాయ సహాయం కూడా

సెప్టెంబర్ 2 న రాజాసింగ్​ను పార్టీ నుంచి సస్పెండ్ చేయగా, సెప్టెంబర్ 5న ఆయనపై పోలీసులు పీడీ యాక్టు పెట్టి చర్లపల్లి జైలుకు పంపించారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. అతనిపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ బీజేపీలోని సెకండ్ క్యాడర్, హిందుత్వ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. చివరకు బీజేపీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంలో కూడా వారి ముందు రాజాసింగ్ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, పలు హిందూ సంఘాలు నిరసనలకు దిగారు. రాజాసింగ్ ను బీజేపీ సస్పెండ్ చేయడంతో ప్రజలు, హిందుత్వవాదులు, పార్టీ క్యాడర్​కు తప్పుడు సంకేతాలు వెళ్లాయి.

దీంతో పార్టీ జాతీయ నాయకత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది. ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేతకు సానుకూలంగా ఉన్నట్లు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి స్పష్టమైన సంకేతాలను పంపించింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం రాజాసింగ్ విషయంలో పూర్తి సానుకూలంగా ఉన్నారు. దీంతో పాటు జైలు నుంచి కూడా బయటకు వచ్చేందుకు న్యాయపరమైన సాయం చేయడంలో సంజయ్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. రాజాసింగ్​ను పీడీ యాక్ట్​ నుంచి బయటకు రప్పించేందుకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.