- స్పీకర్ ఓం బిర్లా వివరణ దురదృష్టకరమని వ్యాఖ్య
న్యూఢిల్లీ, వెలుగు: ఒక ప్రధాని తన స్థానంలోకి వచ్చి మాట్లాడుతుంటే ఎంపీలు దాడి చేసే స్థాయిలో మన ప్రజాస్వామ్యం ఉందా? అని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి ప్రశ్నించారు. ప్రధానిపై దాడి జరుగుతుందనే సమాచారంతో.. పార్లమెంటులోకి మోదీని రావొద్దని స్వయంగా తానే చెప్పినట్టు లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా చెప్పడం దురదృష్టకరమన్నారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఇలా మొట్టమొదటిసారి జరిగిందని, దేశ ప్రజాస్వామ్యంలో ఇదొక బ్లాక్ డే అని అభివర్ణించారు.
కేవలం ప్రధానిని కాపాడటానికి స్పీకర్ తనమీద నింద వేసుకోవడం.. 140 కోట్ల మంది భారతీయులకు అవమానకరమని తెలిపారు. దాడి చేస్తారని సభలోకి రాకపోతే ఇక బయట పరిపాలన ఎలా చేస్తారు? అని ప్రశ్నించారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో మల్లు రవి మాట్లాడారు. లోక్సభలో కొందరు కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీలు ప్రధానిపై దాడిచేసే దురదృష్టకరమైన స్థాయిలో భారత ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు.
