Market Crash: మార్కెట్లలో బ్లాక్ ఫ్రైడే.. మార్కెట్ల పతనానికి కారణాలివే..

Market Crash: మార్కెట్లలో బ్లాక్ ఫ్రైడే.. మార్కెట్ల పతనానికి కారణాలివే..

Black Friday: శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఉదయం 11.25 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 772 పాయింట్ల పతనంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 228 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 625 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 260 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతున్నాయి. బెంచ్ మార్క్ సచూ నిఫ్టీ సెన్సెక్స్ 1 శాతం మేర పతనంతో బ్లాక్ ఫ్రైడే ట్రేడింగ్ కొనసాగుతోంది. అసలు మార్కెట్ల పతనానికి కీలక కారణాలను పరిశీలిస్తే.. 

మధ్యప్రాశ్చంలో ఉద్రిక్తతలు: 
ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో నిన్న రాత్రి నుంచి ఇజ్రాయెల్ ఇరాన్ పై ముందస్తు దాడులకు దిగింది. అయితే దీనికి ప్రతిగా ఇరాన్ కూడా నేడు 100 డ్రోన్లు, మిస్సైళ్లతో తిరిగి దాడులను ప్రారంభించటం ప్రపంచ మార్కెట్లను ఒక్కసారిగా కుప్పకూలటానికి ప్రేరేపించింది. మధ్యప్రాశ్చంలో పెరుగుతున్న ఆందోళనలు భారతీయ మార్కెట్లను కూడా ప్రభావితం చేశాయని యాక్సిస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెచ్ అక్షయ్ చించాల్కర్ అన్నారు. 

బలహీన గ్లోబల్ మార్కెట్లు:
నేడు ఆసియా మార్కెట్లతో పాటు దక్షిణ కొరియా కోస్పి, జపాన్ నిక్కీ, షాంగై, హాంకాంగ్ మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగించటం భారతీయ మార్కెట్లలను నెగటివ్ సెంటిమెంట్లకు దారితీసింది. అలాగే అమెరికా మార్కెట్లలో ఫ్యూచర్లు కూడా నష్టాల్లో ఉండటం పెట్టుబడిదారులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. 

పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు:
ఇరాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో క్రూడ్ నిల్వలు సమృద్ధిగా ఉన్న మధ్యప్రాశ్చ దేశాల నుంచి చమురు రవాణాకు ఆటంకాలు ఏర్పడతాయనే ఆందోళనలు క్రూడ్ అయిల్ రేట్లకు రెక్కలు తెచ్చాయి. వాస్తవానికి భారత్ తన దేశీయ అవసరాల కోసం 85 శాతం చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇది భారత వాణిజ్య లోటును పెంచుతాయనే ఆందోళనలు కొనసాగుతు్నాయి. నేడు ఒక్కరోజే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేటు 12 శాతం పెరిగి బ్యారెల్ 78 డాలర్లకు చేరుకోవటంతో ఆందోళనలు పెరిగాయి. 

విదేశీ పెట్టుబడిదారులు:
కొన్ని వారాలుగా కొనుగోలుదారులుగా ఉన్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో తమ డబ్బును వెనక్కి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కేవలం గురువారం ఒక్కరోజే వారు రూ.3వేల 831 కోట్లకు పైగా విలువైన పెట్టుబడులను విక్రయించటం కూడా మార్కెట్లలో ఒత్తిడిని పెంచుతోంది. 

బలహీనపడిన రూపాయి: 
ప్రస్తుతం కొనసాగుతున్న అంతర్జాతీయ పరిణామాలతో డాలరుతో రూపాయి మారకపు విలువ 56 పైసలు పతనమై రూ.86.08కి చేరుకుంది. డాలర్లకు పెరుగుతున్న డిమాండ్ దీనికి కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఇదే క్రమంలో క్రూడ్ ఆయిల్ రేట్లు, విదేశీ పెట్టుబడి ప్రవాహాలు తరలిపోవటం వంటివి కూడా రూపాయి విలువను ప్రభావితం చేస్తున్నాయని తెలుస్తోంది.