న్యూఢిల్లీ: బ్లాక్మనీలో రూ. 2 వేల నోట్ల సంఖ్య తగ్గుతోంది. 2019–20 లో ఐటీ దాడుల్లో బయటపడ్డ మొత్తం నోట్లలో 2 వేల నోట్లు 43.22 శాతమేనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు చెప్పారు. అంతకు ముందు రెండేళ్లలోనూ 2 వేల నోట్లు 60 శాతం పైనేనని తెలిపారు. 2017–18 లో ఐటీ దాడుల్లో బయటపడ్డ రూ. 2 వేల నోట్ల శాతం 67.91 శాతమైతే, 2018–19 లో ఇది 65.93 శాతం. నవంబర్ 2016 లో డీమానిటైజేషన్ తర్వాత ఈ రూ. 2 వేల నోటును ప్రవేశ పెట్టారు.
గత మూడు ఆర్థిక సంవత్సరాలలో బ్లాక్మనీ బయటకు తెచ్చేందుకు జరిపిన దాడుల్లో సీజర్స్ ఆధారంగా ఐటీ డిపార్ట్మెంట్ ఈ డేటా రూపొందించింది. రూ. 5 కోట్లకు మించిన సీజర్స్నే పరిగణనలోకి తీసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండానే రూ. 2 వేల నోటును రద్దు చేయొచ్చని ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖ మాజీ సెక్రటరీ సుభాష్ చంద్ర గర్గ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ రూ. 2 వేల నోట్లు చలామణీలో తక్కువగానే ఉన్నాయని, చాలా మంది వాటిని దాచి పెట్టుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.