
న్యూఢిల్లీ: అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు బ్లాక్రాక్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ), అలానే డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్, నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ వేదాంతలో వాటాలను పెంచుకున్నాయి. గత నాలుగు నెలల్లో వీటి వాటా 2 శాతం మేర పెరిగింది. ఇందులో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) వాటా 1.2 శాతం ఉంది. బిజినెస్లను డీమెర్జ్ చేస్తుండడంతో పాటు, మెటల్ ధరలు పెరగడంతో వేదాంత షేర్లు గత కొన్ని సెషన్లుగా ర్యాలీ చేస్తున్నాయి. డొమెస్టిక్, గ్లోబల్ ఫండ్లు ఈ కంపెనీ షేరుపై బుల్లిష్గా ఉన్నాయి. ‘ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉండడంతో ఫారిన్, డొమెస్టిక్ ఇన్వెస్టర్లు వేదాంతపై బుల్లిష్గా ఉన్నారు’ అని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఈ ఏడాదిలో వేదాంత షేర్లు 30 శాతం పెరగగా, కంపెనీ మార్కెట్ క్యాప్ 3 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ నెల 5 న కంపెనీ షేర్లు 3 శాతం ర్యాలీ చేసి రూ.322 దగ్గర 52 వారాల గరిష్టాన్ని టచ్ చేశాయి. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలోనే 15 శాతం పెరిగింది. చైనాలో మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ పుంజుకోవడంతో గ్లోబల్గా మెటల్ ధరలు పెరుగుతున్నాయి. ఐరన్ ఓర్, స్టీల్, కాపర్, అల్యూమినియం వంటి మెటల్స్ను సప్లయ్ చేసే వేదాంతకు ఇది మేలు చేసే అంశం.