కౌలాలంపూర్: మయన్మార్ నుంచి సుమారు 300 మంది వలసదారులతో వచ్చిన బోటు.. థాయ్లాండ్, మలేసియా మధ్య హిందూ మహాసముద్రంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడు మృతదేహాలు సముద్రంలో దొరికాయి. మరో 13 మందిని రెస్క్యూటీం రక్షించింది. ప్రమాద సమయంలో పడవలో 300 మంది ఉన్నారని, వారంతా గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.
మలేసియా మారిటైమ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి చెందిన ఫస్ట్ అడ్మిరల్ రోమ్లీ ముస్తఫా మాట్లాడుతూ.. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం బోటు మయన్మార్ రాఖైన్ రాష్ట్రంలోని బుథిడాంగ్ టౌన్ నుంచి బయలుదేరిందని.. 3 రోజుల క్రితం మునిగిపోయి ఉంటుందని తెలిపారు. మలేసియా ఉత్తర రిసార్ట్ ద్వీపమైన లంగ్కావి సమీపంలోని జలాల్లో కొందరు తేలుతూ కనిపించడంతో శనివారం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని తెలిపారు.
