పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇంటి దగ్గర లైవ్ బాంబు కనిపించడంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. భగవంత్ మాన్ హెలీప్యాడ్ కు అత్యంత సమీపంలోనే పోలీసులు బాంబును గుర్తించారు . బాంబు దొరికిన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హుటాహుటిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్ అక్కడికి చేరుకొని బాంబును నిర్వీర్యం చేసింది. భారత సైన్యానికి చెందిన పశ్చిమ కమాండ్, పోలీస్ స్పెషల్ టీమ్స్ దీనిపై దర్యాప్తును ప్రారంభించాయి. భగవంత్ మాన్ హత్యకు కుట్ర జరిగిందా ? ఉగ్రకోణం ఉందా ? ఇది ఆకతాయిల చర్యా ? అనే కోణాల్లో ఆరా తీస్తున్నారు.
ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో సీఎం భగవంత్ మాన్ హెలిప్యాడ్ కు సమీపంలో ఉన్న మామిడి తోటలో లైవ్ బాంబ్ షెల్ ను ట్యూబ్ వెల్ ఆపరేటర్ పనిచేసే ఒక వ్యక్తి గుర్తించాడు. బాంబును గుర్తించిన సమయంలో ఇంట్లో సీఎం లేరు. సీఎం ఇంటి నుంచి కిలోమీటరు దూరంలోనే బాంబు పడి ఉండటం కలకలం సృష్టించింది.