- పట్టు వస్త్రాలు సమర్పించనున్న రాష్ట్ర మంత్రులు
- 17న సికింద్రాబాద్ ఉజ్జయిని, 24న పాతబస్తీ బోనాలు..
- ఈ నెల 30 నుంచి జులై 28 వరకు సంబురాలు
మెహిదీపట్నం, వెలుగు: ఆషాఢం బోనాలు గురువారం నుంచి షురూ కానున్నాయి. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల జాతర ప్రారంభం కానుంది. గోల్కొండ బోనాల తర్వాత వారం లష్కర్లో, ఆ తర్వాత లాల్ దర్వాజా, ధూల్పేట, బల్కంపేట, పాతబస్తీ అమ్మవారి ఆలయాల్లో నెలంతా బోనాల సంబురం జరుగనుంది. గురువారం గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారి బోనాల జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఉదయం లంగర్ హౌస్ చౌరస్తా నుంచి అమ్మవారి రథం, భారీ తొట్టెల ఊరేగింపు ప్రారంభమవుతుంది.
భక్తుల కోలాహలం, డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో ఊరేగింపు గోల్కొండ కోటకు చేరుకుంటుంది. మధ్యలో చోట బజార్లోని పూజారి అనంత చారి ఇంట్లో అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఊరేగింపు సాయంత్రానికి కోటలోని జగదాంబిక మహంకాళి(ఎల్లమ్మ) అమ్మవారి దేవాలయానికి చేరుకుంటుంది. కోట పైన అమ్మవారికి భారీ తొట్టెలను సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. కాగా జులై17న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు,18న రంగం భవిష్యవాణి ఉంటుంది. జులై 24న పాతబస్తీ బోనాలు, 25న ఉమ్మడి దేవాలయాల ఘటాల ఊరేగింపు నిర్వహించనున్నారు. మొత్తంగా భాగ్యనగరంలో జూన్30న మొదలయ్యే బోనాల సంబురం జులై 28 వరకు కొనసాగనున్నాయి.
భారీ బందోబస్తు..
గోల్కొండ కోటలో జగదాంబికా బోనాల జాతరకు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పశ్చిమ మండల డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. 800 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. షీ టీమ్స్, మహిళా పోలీసులు, అశ్వక దళంతో పాటు సీసీ కెమెరాల నిఘా ఉంటుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో భారీ కేడ్లను ఏర్పాటు చేసినట్లు డీసీపీ చెప్పారు.