
- లేని గుళ్లకు బోనాల చెక్కులు
- విచారణ జరపాలన్న కాంగ్రెస్ నేత ఐత చిరంజీవి
పద్మారావునగర్, వెలుగు: ఆషాఢ మాస బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం ఇచ్చే చెక్కులు కొన్నేండ్లుగా పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బన్సీలాల్పేట డివిజన్లోని పద్మారావునగర్లో ఓ అపార్ట్మెంట్ పక్కనున్న ఖాళీ స్థలంలో టెంపుల్ పేరుపై ఓ వ్యక్తి గత 8 ఏండ్లుగా ప్రభుత్వం నుంచి బోనాల చెక్కులను పొందుతున్నట్లు కాంగ్రెస్ నేత ఐత చిరంజీవి ఆరోపించారు.
తమ ఫిర్యాదుతో గురువారం ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ సైదులు ఈ వ్యవహారంపై విచారణ జరిపారన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. డివిజన్లోని మరికొన్ని చోట్ల ఒకే టెంపుల్పై రెండేసి చెక్కులను తీసుకున్నారన్నారు. పద్మారావునగర్లో ఒకే టెంపుల్నుంచి ఒకే వ్యక్తి ఏటా రెండేసి చెక్కులను తీసుకుంటున్నారని ఆరోపించారు.
బీజేఆర్ నగర్లో ఓ ఆలయం పేర ఒకే టెంపుల్ నుంచి ఓ వ్యక్తి ఏటా రెండేసి చెక్కులను తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలా కొన్ని టెంపుల్స్కు కోడ్ లేకుండానే అధికారులు ఆయా వ్యక్తులకు రెండేసి చెక్కులను ఇస్తున్నారని తెలిపారు. డివిజన్ లో మొత్తం 26 ఆలయాలకు సంబంధించిన లక్షలాది రూపాలయల బోనాల చెక్కుల గోల్మాల్ జరిగిందని, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.