
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తనను చంపేందుకు కుట్ర పన్నాడని జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఆరోపించారు. బోరబండకి చెందిన సర్దార్ చావుకు తానే కారణమంటూ ఎమ్మెల్యే మాగంటి తన ఇంటిపై దాడి చేయించడానికి ప్రయత్నించాడని చెప్పారు. తనపై దాడి చేయాలని సోషల్ మీడియాలో ప్రచారం చేయించారని విమర్శించారు.
జూన్ 4న మీడియాతో మాట్లాడిన బాబా ఫసియుద్దీన్.. సర్దార్ నాకు దగ్గరి వాడు . సర్దార్ మరణం నన్ను కలిచి వేసింది. సర్దార్ చనిపోయాడని తెలియగానే వెళ్లాలనుకున్నా. కానీ అక్కడ నన్ను చంపేస్తామని స్లొగన్స్ చేశారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని పోలీసులు శవయాత్రకు నన్ను రానివ్వలేదు. సర్దార్ ప్రమాదవశాత్తు చనిపోయాడని పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు. కానీ సూసైడ్ చేసుకున్నాడని మాగంటి అసత్య ప్రచారం చేశారు. మాగంటి గోపినాథ్ శవ రాజకీయాలు చేశారు. నాపై నా ఇంటిపై మాగంటి దాడి చేయించడానికి ప్రయత్నించాడు. నాపై దాడి చేయాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారు. నాపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై జీహెచ్ఎంసీ కమీషనర్ కి కంప్లెయింట్ చేస్తా అని అన్నారు.
బీఆర్ఎస్ బోరబండ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ సర్దార్ (33) మే 28న బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధింపుల వల్లే సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సర్దార్ తమ్ముడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.