భారత్,అస్ట్రేలియా జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ మొదలుకానుంది. నాగాపూర్ వేదికగా మొదలుకానున్న ఈ ట్రోఫీ కోసం ఇరు జట్ల ఇప్పటికే ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశాయి. ఇంతకీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎప్పుడు మొదలైంది? ఏఏ జట్లు ఎన్నెన్ని సార్లు గెలిచాయి. అత్యధిక స్కోర్ ఎవరిది? అత్యధిక వికెట్లు తీసింది ఎవరు? బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్రపై ఓ లుక్కేస్తే..
1996లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలైంది. ఇప్పటి వరకు మొత్తం 15 సిరీస్లు జరగగా భారత్ 9, ఆసీస్ 5 సిరీస్ల్లో గెలుపొందాయి. ఓ సిరీస్ డ్రాగా ముగిసింది. ఈ సిరీస్ లో సచిన్ టెండూల్కర్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 65 ఇన్నింగ్స్లలో సచిన్ 56.24 సగటుతో 3,262 పరుగులు చేయగా.. అందులో 9 సెంచరీలు,16 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు (241)గా ఉంది. ఆ తరువాతి స్థానంలో రికీ పాంటింగ్ (29 టెస్ట్ల్లో 2555), వీవీఎస్ లక్ష్మణ్ (29 టెస్ట్ల్లో 2434), రాహుల్ ద్రవిడ్ (32 టెస్ట్ల్లో 2143), మైఖేల్ క్లార్క్ (22 టెస్ట్ల్లో 2049) పరుగులు చేసి టాప్-5లో ఉన్నారు.
ఇక బౌలర్ల విషయానికి వస్తే టీమిండియా మాజీ స్పిన్నర్లు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్లు టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఈ ట్రోఫీలో కుంబ్లే 20 మ్యాచ్ల్లో 111 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్గా ఉండగా.. భజ్జీ 18 టెస్ట్ల్లో 95 వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో ఉన్నాడు. భజ్టీ ఒక మ్యాచ్ లో అత్యధికంగా 15 వికెట్లు పడగొట్టగా, కుంబ్లే 13 వికెట్లు తీశాడు. ఆసీస్ నుంచి స్పిన్నర్ నాథన్ లయోన్ టాప్లో ఉన్నాడు. లయోన్ ఒకే ఇన్నింగ్స్లో 50 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు.