బోర్లకు పర్మిషన్లు తీస్కోవట్లే.. యూజర్​ చార్జీలు కడ్తలే

బోర్లకు పర్మిషన్లు తీస్కోవట్లే.. యూజర్​ చార్జీలు కడ్తలే
  • వాల్టా, జీఓ 15 ఉల్లంఘించి బోర్ల తవ్వకాలు 
  • విచ్చలవిడిగా గ్రౌండ్​ వాటర్​తోడేస్తున్నరు 
  • సర్కారు ఆదాయానికి కోట్లలో గండి 
  • టౌన్లలో ఇంటికో బోరున్నా రికార్డుల్లో 27వేలే.. వ్యవసాయ బోర్లూ అందులోనే  
  • రూల్స్​పాటించని కమర్షియల్ ఎస్టాబ్లిష్​మెంట్స్, ఇండస్ట్రీస్ 

మంచిర్యాల, వెలుగు: వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి బోర్ల తవ్వకాలు జోరుగా సాగుతున్నారు. ఎండాకాలం రావడంతో మంచిర్యాల జిల్లాలోని టౌన్లలో ఎక్కడ చూసినా రిగ్గుల మోతలు వినిపిస్తున్నాయి. వీటిలో ప్రభుత్వ పర్మిషన్లు లేకుండా అక్రమంగా తవ్వుతున్నవే అధికం. ఇష్టారీతిన బోర్లు వేస్తూ గ్రౌండ్​ వాటర్​ను విచ్చలవిడిగా తోడేస్తున్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, కమర్షియల్​ఎస్టాబ్లిష్​మెంట్స్​తో పాటు నివాస గృహాల్లోనూ ఇదే పరిస్థితి. నానాటికీ ఇంకిపోతున్న భూగర్భ జలాలను కాపాడేందుకు ఉన్న చట్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. 

బోర్ల పర్మిషన్లు, వాటర్​ యూజర్​ చార్జీల రూపంలో ప్రభుత్వం కోట్లలో ఆదాయం కోల్పోతోంది. ప్రస్తుతం గ్రౌండ్​ వాటర్ ఎక్స్​ట్రాక్షన్​లో జిల్లా సేఫ్​ జోన్​లోనే ఉన్నప్పటికీ.. బోర్ల తవ్వకాలను కంట్రోల్​ చేయకపోతే గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

కేటగిరీని బట్టి ఫీజులు 

వ్యవసాయ బోర్లు, నివాస గృహాలకు రూ.వెయ్యి, అపార్ట్​మెంట్లు, హాస్పిటళ్లు, హోటళ్లు, లాడ్జీలు, స్కూళ్లు, కాలేజీలు, వాటర్​ ప్లాంట్లు వంటి కమర్షియల్​ఎస్టాబ్లిష్​మెంట్స్​కు రూ.10 వేల ఫీజు చెల్లించాలి. ఇండ్రస్టీస్​కు కేటగిరీని బట్టి 25 కేఎల్​డీ (కిలో లీటర్స్​పర్​డే)కి రూ.14,500, 25 నుంచి 50 కేఎల్​డీకి రూ.18వేలు, 50 నుంచి వంద కేఎల్​డీకి రూ.32వేలు, వందకుపైగా ఉంటే రూ.42వేలుగా ప్రభుత్వం ​ఫిక్స్​చేసింది. కమర్షియల్​ ఎస్టాబ్లిష్​మెంట్స్​కు ఐదేండ్లకోసారి రూ.5వేల ఫీజు చెల్లించి ఎన్​ఓసీ రెన్యువల్​చేసుకోవాలి. ఇండస్ట్రీస్​కు రూ.10వేల ఫీజుతో మూడేండ్లకోసారి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండ్లు, వ్యవసాయ బోర్లకు మినహాయింపు ఇచ్చింది.

ఎక్స్​ట్రాక్షన్​ చార్జీలు ఎగనామం

ఆయా సంస్థలు గ్రౌండ్​ వాటర్​ను వాడుకునే పరిమాణాన్ని బట్టి ప్రభుత్వానికి ఎక్స్​ట్రాక్షన్​ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వీటిని సైతం 4  కేటగిరీలుగా విభజించారు. ఒక ఏడాదిలో భూమిలోకి ఇంకిన 100 లీటర్ల నుంచి 70 లీటర్లు తోడుకుంటే సేఫ్​జోన్​, 70 నుంచి 90 లీటర్లకు సెమీ క్రిటికల్, 90 నుంచి 100 లీటర్లకు క్రిటికల్, 100 పైగా అయితే ఓవర్​ ఎక్స్​ప్లాయిటెడ్​జోన్లుగా పరిగణిస్తారు. ఒక కేఎల్​డీ (వెయ్యి లీటర్లు)కి సేఫ్​ జోన్​లో రూపాయి, సెమీ క్రిటికల్​ జోన్​లో రూ.2, క్రిటికల్​ జోన్​లో రూ.4, ఓవర్​ ఎక్స్​ప్లాయిటెడ్ ​జోన్​లో రూ.6 చొప్పున వసూలు చేస్తారు. రోజుకు 200 కేఎల్​డీ దాటితే స్లాబ్​ మారుతుంది. ఎక్స్​ట్రాక్షన్ ​చార్జీల కింద సింగరేణి గత ఆరు నెలలకు రూ.1.10 కోట్లు, ఓరియంట్ ​సిమెంట్​ కంపెనీ రూ.14.24 లక్షలు చెల్లించినట్టు గ్రౌండ్​ వాటర్ ​అధికారులు తెలిపారు.

అక్రమ బోర్లు రికార్డుల్లోకి ఎక్కలే..

అక్రమ బోర్లు గవర్నమెంట్​ రికార్డుల్లోకి ఎక్కకపోవడం వల్ల ఎవరు ఎన్ని నీళ్లు వాడుకుంటున్నారనే లెక్కలు తెలియడంలేదు. పలు కమర్షియల్​ఎస్టాబ్లిష్​మెంట్స్, ఇండస్ట్రీస్​ ఎక్స్​ట్రాక్షన్​ చార్జీలకు ఎగనామం పెడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 2లక్షలకు పైగా నివాస గృహాలు ఉండగా, మున్సిపాలిటీల్లో ఇంటికో బోరు ఉంది. సింగరేణి వంటి ఇండస్ట్రీస్​లో వందల సంఖ్యలో ఉన్నాయి. కానీ జిల్లావ్యాప్తంగా వ్యవసాయ బోర్లతో కలిపి 27,516 మాత్రమే రికార్డుల్లో నమోదయ్యాయి. రికార్డుల్లో లేనివి రెంట్టిపు సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. వీటిని సైతం నమోదు చేసేందుకు గ్రౌండ్​వాటర్​అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

చట్టం ఉన్నా పర్మిషన్లు లేకుండానే తవ్వకాలు 

2002లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వాల్టా చట్టం ప్రకారం నివాస, వ్యవసాయ, కమర్షియల్​బోర్ల తవ్వకాలకు పర్మిషన్​ తీసుకోవాలి. ఈ రూల్స్​ను మరింత కఠినతరం చేస్తూ బీఆర్ఎస్​ సర్కారు 2023 జూన్​లో జీఓ ఎంఎస్ నంబర్​15ను తీసుకొచ్చింది. దీనిప్రకారం ముందుగా నిర్ణీత రుసుము చెల్లించి ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. గ్రౌండ్​వాటర్ ​అధికారులు బోర్​పాయింట్​ను పరిశీలించి ఫీజు బులిటీ రిపోర్ట్, ఎన్​ఓసీ ఇస్తారు. దాని ఆధారంగా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు బోర్ల తవ్వకాలకు పర్మిషన్లు​ జారీ చేస్తారు. కానీ ఈ రూల్స్​ఎక్కడా సరిగా అమలు కావడం లేదు. 

నోటీసులు జారీ చేస్తున్నాం 

వాల్టా, జీఓ నంబర్​15 ప్రకారం బోర్లు తవ్వడానికి గ్రౌండ్​వాటర్​ నుంచి ఎన్​ఓసీ తోపాటు రెవెన్యూ, మున్సిపల్ డిపార్ట్​మెంట్ల నుంచి కూడా పర్మిషన్లు తీసుకోవాలి. కానీ చాలాచోట్ల ఈ రూల్స్ పాటించకుండానే అక్రమంగా బోర్లు వేస్తున్నారు. అలాంటి వాటిని గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నాం. ఇప్పటివరకు జిల్లాలో వంద నోటీసులు అందించాం. అక్రమంగా బోర్లు తవ్వే రిగ్గుల యజమానులకు ఫైన్లు వేస్తున్నాం. రిజిస్ట్రేషన్​చేసుకోవాలని కోరుతున్నాం. బోర్లకు పర్మిషన్​కోసం దరఖాస్తు చేసుకుంటే మా సిబ్బంది వచ్చి బోరు పాయింట్​ను పరిశీలించి ఫీజు బులిటీ రిపోర్ట్​ ఇస్తారు. దాంతో నీళ్లున్న చోటనే బోరు వేసుకోవచ్చు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. 

- శ్రీనివాస్, గ్రౌండ్​ వాటర్​ ఇన్​చార్జి డీడీ, మంచిర్యాల