తాను చనిపోయి మరో నలుగురిని బ్రతికించాడు ఓ హెడ్ కానిస్టేబుల్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన మేకల శ్యామ్ సుందర్ (41) అనే హెడ్ కానిస్టేబుల్ 2024 జనవరి 27 శనివారం రోజున తన ఇంట్లో హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఎల్బీ నగర్లోని కామినేని ఆస్పత్రికి తరలించారు .
కామినేని హాస్పిటల్స్లోని వైద్యులు శ్యామ్ సుందర్కు 22 రోజుల పాటు ఐసియూలో కేర్ సపోర్ట్ అందించారు, కానీ అతని ఆరోగ్యంలో ఎటువంటి మార్పు కనిపించలేదు. ఫిబ్రవరి 18 ఆదివారం ఉదయం 10.35 గంటలకు శ్యామ్ సుందర్ బ్రెయిన్ డెడ్ అయినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
జీవందన్ అవయవదాన కోఆర్డినేటర్లు కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహించి శ్యామ్ సుందర్ కుటుంబ సభ్యులకు అవయవదానం ప్రాముఖ్యతను వివరించారు. శ్యామ్ సుందర్ అవయవాలను దానం చేసేందుకు ఆయన భార్య లిఖిత సమ్మతించడంతో అతని అవయవాలను నలుగురు రోగులకు అమర్చారు. శ్యామ్ సుందర్ కు భార్యతో పాటుగా ముగ్గురు పిల్లలు ఉన్నారు.