ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

నారాయణపేట/నాగర్​కర్నూల్​, వెలుగు: బీజేపీ నేత, నిజామాబాద్​ఎంపీ  అర్వింద్​ ఇంటిపై దాడిని నిరసిస్తూ శుక్రవారం  నారాయణపేట, నాగర్​ కర్నూల్​ జిల్లా కేంద్రాల్లో బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. నారాయణపేటలో టీఆర్ఎస్​ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, కె.రతంగ్ పాండురెడ్డి, జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాసులు మాట్లాడుతూ  బీజేపీకి పెరుగుతున్న ఆదరణ కు ఓర్వలేకనే టీఆర్ఎస్​ బీజేపీ లీడర్లపై భౌతిక దాడులకు దిగుతోందన్నారు. ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు చేసి వెంటనే  అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.  బీజేపీ జిల్లా నాయకులు ప్రభాకర్ వర్ధన్, సత్యయాదవ్, అసెంబ్లీ కన్వీనర్, కోకన్వీనర్లు పాల్గొన్నారు. 

నాగర్​కర్నూల్​జిల్లా బీజేపీ ఆఫీస్​నుంచి బస్టాండ్​చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత దొడ్ల రాజవర్ధన్​రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితను వెంటనే అరెస్ట్​చేయాలని డిమాండ్​చేశారు.  జిల్లా నేతలు పోల్ దాసు రాము, నాగరాజు, భరత్ చంద్ర, నిరంజన్ గౌడ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

సైన్స్​ ఫెయిర్​ను సక్సెస్​ చేయండి

వనపర్తి, వెలుగు: జిల్లా కేంద్రంలో ఈ నెల 19, 20 తేదీల్లో నిర్వహించే జిల్లా  సైన్స్​ఫెయిర్​ను సక్సెస్ ​చేయాలని డీఈవో రవీందర్  కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జిల్లా సైన్స్ ఫెయిర్ ఏర్పాటు పై  మీటింగ్​నిర్వహించారు.ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి మంత్రి  నిరంజన్ రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, జడ్పీ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఏఎంవో ఎస్.చంద్రశేఖర్, జిల్లా సైన్స్ ఆఫీసర్ శ్రీనివాసులు, వివిధ పాఠశాలల జీహెచ్ఎంలు పాల్గొన్నారు.

దళిత బంధుపై వివక్ష చూపొద్దు
 
అమ్రాబాద్, వెలుగు:  దళిత బంధు పథకం అమలులో వివక్ష చూపొద్దని మాల మహానాడు జాతీయ  అధ్యక్షుడు జి. చెన్నయ్య  కోరారు. శుక్రవారం  మన్ననూరు వద్ద మాల మహానాడు నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకం టీఆర్ఎస్​కార్యకర్తలకే ఇవ్వడం  అన్యాయమన్నారు. పథకం అమలులో  పార్టీలకతీతంగా మాల,మాదిగలకు సమానంగా అమలు చేయాలన్నారు. ఎస్సీల రిజర్వేషన్లు 10 శాతం పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం దళిత బహుజన వర్గాలపై వివక్ష చూపుతోందని అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ పెంచడం ఎక్కడి న్యాయం అన్నారు. అగ్రవర్ణాల రిజర్వేషన్ బిల్లును మాల మహానాడు పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు.  

వాల్మికులకు అండగా బీజేపీ

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని చెప్పిన రాష్ర్ట ప్రభుత్వం మాట తప్పిందని, రాబోయే రోజుల్లో వాల్మీకులు చేపట్టే ఉద్యమాలకు బీజేపీ అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో వాల్మీకి బోయలు చేపట్టిన దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగతా రావాల్సిన  రిజర్వేషన్ ఫలాలు నేటికి అందకపోవడం బాధాకరమని,  బీజేపీ బడుగు, బలహీనవర్గాల  అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తుందన్నారు. దీక్షలో వివిధ ప్రాంతాలకు చెందిన వాల్మీకి నాయకులు జనార్దన్, శివరాము, పెద్దనర్సిములు, కోసిగి సతీశ్​కుమార్, రాం లక్ష్మణ్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.                 

కొత్త విద్యావిధానంతో పేద విద్యార్థులకు నష్టం

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు:  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను ప్రైవేట్, కార్పొరేట్​చేతుల్లో పెట్టి, కొత్త విద్యావిధానం తీసుకొచ్చి పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నాయని పీవైఎల్ రాష్ట్ర​మాజీ అధ్యక్షుడు హన్మేశ్​ఆరోపించారు.  శుక్రవారం జిల్లా కేంద్రంలో పీడీఎస్ యూ రాష్ట్ర 15వ మహాసభలు జరిగాయి. హాజరైన హన్మేశ్​మాట్లాడుతూ స్కాలర్ షిప్, ఫీజు రీయంబర్స్​మెంట్, మెస్ చార్జీల కోసం ఇంకా పోరాటాలు చేయాల్సి రావడం బాధాకరమన్నారు. పీడీఎస్​యూ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరా రావు, కార్యదర్శి బోయినపల్లి రాములు మాట్లాడుతూ  ప్రభుత్వాలు విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పీడీఎస్​యూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, సీపీఐ(ఎంల్) ప్రజాపంథా రాష్ట్ర నాయకుడు కృష్ణ,  జిల్లా కార్యదర్శి రాంచందర్, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. 

 టూర్​లో టీచర్​.. ఆటల్లో స్టూడెంట్స్​
   
గండీడ్, వెలుగు : జిల్లాలోని మహమ్మదాబాద్, గండీడ్​ మండలాల్లోని బొట్లగడ్డ తండా, వడ్డెగుడిసెల గ్రామాల్లో లోని ప్రైమరీ స్కూల్స్​టీచర్లు విధులను నిర్లక్ష్యం చేస్తుండడంతో స్టూడెంట్లు చదువుకు దూరమవుతున్నారు.  బొట్లగడ్డ తండాలోని స్కూల్​లో పది మంది స్టూడెంట్లు ఉండగా.. వెంకటయ్య అనే ఒక్కడే టీచర్ విధులు నిర్వహిస్తున్నారు.  5 రోజుల కింద ఆయన పై ఆఫీసర్ల పర్మిషన్​ లేకుండానే విహారయాత్రకు వెళ్లడంతో స్టూడెంట్లు స్కూల్​కు వెళ్లి  గ్రౌండ్​లో ఆడుకుని వస్తున్నారు. శుక్రవారం ఈ విషయాన్ని  గమనించిన తల్లిదండ్రులు టీచర్​కు ఫోన్​ చేసి అడగగా.. ‘నేను  సెలవులో ఉన్నాను.. టూర్​వెళ్లాను..  ఇప్పట్లో రాను.. పిల్లలకు వంట వండి పెట్టమని మిడ్​డే మీల్స్​వర్కర్లకు చెప్పండి’ అని  చెప్పారు. ఈ విషయంపై  తల్లిదండ్రులు కాంప్లెక్స్​ హెడ్​ మాస్టర్​ఆనంద్​ను అడగగా తనకు వాట్సాప్​ మెసేజ్​పెట్టాడని, తాను లీవ్​ శాంక్షన్​చేయలేదని  చెప్పడం గమనార్హం.

 పది దాటినా  పంతులు లేడు

గండీడ్ మండలంలోని రుసుంపల్లి అనుబంధ గ్రామమైన  వడ్డెగుడిసెల ప్రైమరీ స్కూల్​లో ఆరుగురు విద్యార్థులు ఉండగా..  టీచర్​ సమయపాలన పాటించకపోవడంతో  ప్రైవేట్​పాఠశాలకు వెళ్తున్నారు.  సదరు టీచర్ ​రోజూ వచ్చి అటెండెన్స్​ వేసుకుని వెళ్తున్నాడు.  శుక్రవారం ఎంపీడీవో రూపేందర్​రెడ్డి  పరిశీలించగా  అక్కడ స్టూడెంట్లు కనిపించలేదు.  టీచర్​ను స్టూడెంట్లు లేరా?  అని అడగగా పొంతన లేని సమాధానం చెప్పాడు. దీంతో ఎంపీడీవో ఎంఈవో వెంకటయ్యను ఫోన్ చేసి మాట్లాడగా..  స్కల్​లో ఆరుగురు స్టూడెంట్లు ఉన్నారని, టీచర్​సమయ పాలన పాటించకుంటే చర్యలు తీసుకుంటానని చెప్పాడు.  
ఈ రెండు సంఘటనలపై ఎంఈవో వెంకటయ్య స్పందించారు.  5 రోజులు విహారయాత్రకు వెళ్లేందుకు తన పర్మిషన్​ తీసుకోవాల్సి  ఉన్నా.. తీసుకోలేదన్నారు.   త్వరలో విచారణ చేసి చర్యలు తీసుకుంటా’ అని అన్నారు. 

ఆడపిల్లలను బాగా చదివించాలి

మహబూబ్ నగర్, వెలుగు: ఆడపిల్లలను బాగా చదివించి ఉన్నత స్థానంలో నిలపాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్  పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన హన్వాడ మండలం పల్లెమోని కాలనీ  లో  జ్యోతిబాపూలే గర్ల్స్​గురుకుల స్కూల్​ను  ప్రారంభించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ హన్వాడ మండలంలో బాల్యవివాహాలు ఎక్కువగా  జరిగేవని, దీనిని దృష్టిలో ఉంచుకుని హన్వాడ మండలంలో బాలికలకు 2 గురుకుల స్కూల్స్ పెట్టామన్నారు. ఆడపిల్ల ఎవరికి భారం కాదని, చదువు, సంస్కారం నేర్పిస్తే భవిష్యత్ లో తల్లిదండ్రులను మగపిల్లల కన్నా వారే బాగా చూసుకుంటారన్నారు.  జడ్పీ చైర్​పర్సన్​ స్వర్ణమ్మ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంతో అభివృద్ధి జరిగిందని  జిల్లాలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. బీసీ గురుకులాల సెక్రటరీ మల్లయ్య బట్టు మాట్లాడుతూ తెలంగాణ రాక  ముందు రాష్ట్రంలో 19 బీసీ గురుకుల  స్కూళ్లు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 310 కి చేరిందన్నారు. 
జిల్లా బీసీ వెల్ఫేర్​ఆఫీసర్​ఇందిర, హన్వాడ ఎంపీపీ బాలరాజు, జడ్పీటీసీ విజయనిర్మల , సర్పంచులు  పాల్గొన్నారు. 

బీసీలు రాజ్యాధికారం సాధించాలి

అడ్డాకుల, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకొని బీసీలు రాజ్యాధికారం వైపు అడుగులేయాలని బీజేపీ నేత దేవరకద్ర బాలన్న పిలుపునిచ్చారు.  శుక్రవారం  అడ్డాకులలో నిర్వహించిన బీసీ సంఘాల ఆత్మీయ సమ్మేళనానికి అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీశ్​యాదవ్, బీసీ టైమ్స్ అధినేత సూర్యరావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  దేశంలో, రాష్ట్రంలో  60 శాతానికి పైగా ఉన్న బీసీలు, చట్టసభల్లో 10 శాతం కూడా లేకపోవడం బాధాకరమన్నారు.  బీసీలు ఇకనైనా మేలుకొని 15 శాతం ఉండి రాజ్యమేలుతున్న అగ్రవర్ణాలను గద్దెదింపి  రాజ్యాధికారం సాధించాలన్నారు. వనపర్తి పట్టణ మున్సిపాలిటీలో రెండు కులాలు కలిస్తేనే ఒక చైర్మన్ సీటు సాధించే సీట్లు సాధించారని, 3 కులాలు కలిస్తే ప్రతి  నియోజకవర్గంలో బీసీలే ఎమ్మెల్యే సీటు గెలుస్తారన్నారు. లీడర్లు వెంకటేశ్వర్లు, జనంపేట రాములు, అడ్వకేట్ ఆంజనేయులు, పొట్టినేని గోపాలకృష్ణ, రమేశ్​ పాల్గొన్నారు. 

న్యూ టెక్నాలజీతో ఫిజికల్ టెస్టులు

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల కోసం ఫిజికల్ టెస్టులను  న్యూ టెక్నాలజీతో నిర్వహిస్తామని ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం జిల్లాకు వచ్చిన టెక్నికల్ టీమ్​తో కలిసి జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్ ను పరిశీలించారు. ఈ  సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు త్వరలో  ఫిజికల్​ టెస్టులు రేడియో వేవ్, సెన్సార్​ పద్ధతుల ద్వారా జరుగుతాయన్నారు. ఎలాంటి అవకవతకలకు చోటు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అభ్యర్థులు కాన్ఫిడెన్స్​తో గెలిచేందుకు కృషి చేయాలన్నారు. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని అభ్యర్థులెవరూ పైరవీకారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. గ్రౌండ్ లో ఏర్పాటు చేయాల్సిన టెక్నికల్, ఇతర  వసతులపై  సిబ్బందికి ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఏఎస్పీ రాములు, డీఎస్పీలు మహేశ్, శ్రీనివాసులు, టెక్నికల్ టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు. 

కేసీఆర్ పాలనలో దళితులకు ఒరిగిందేమీ లేదు

నారాయణపేట, వెలుగు:  కేసీఆర్ పాలనలో దళితులకు ఒరిగిందేమీ లేదని బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, కె.రతంగ్ పాండురెడ్డి, రాష్ట్ర దళిత మోర్చా కన్వీనర్ విజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో దళిత బస్తీలో ‘బస్తీ సంపర్క్ అభియాన్’ కార్యక్రమం నిర్వహించారు. కేంద్రం దళితులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసాలను ఇంటింటికి వెళ్లి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి సీఎం కేసీఆర్ దళిత ద్రోహిగా మారారన్నారు.  దళితుల సంక్షేమానికి  ఎన్నో పథకాలు అమలు చేస్తూ  కేంద్ర ప్రభుత్వం దళిత పక్షపాతిగా నిలిచిందన్నారు. బీజేపీ జిల్లా  ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ వర్ధన్, నాయకులు టి.ఆశప్ప, మహబూబ్ అలీ, అశోక్, రఘు రామయ్యగౌడ్, సత్యరఘుపాల్, రమేశ్, బాబు, లింగరాజు పాల్గొన్నారు.