
- తిరువనంతపురం చేరుకున్న
- 25 మంది బ్రిటిష్ ఇంజనీర్ల బృందం
తిరువనంతపురం: సాంకేతిక సమస్యతో కేరళలోని తిరువనంతపురం ఎయిర్పోర్టులో నిలిచిపోయిన బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన ఎఫ్ 35 ఫైటర్ జెట్కు రిపేర్ పనులను ముమ్మరం చేశారు. అందుకు 25 మంది ఇంజనీర్ల బృందం బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్బస్ A400ఎం అట్లాస్లో ఆదివారం తిరువనంతపురం ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఇప్పటిదాకా భారీ సెక్యూరిటీ నడుమ ఎయిర్పోర్ట్ టార్మాక్ మీద ఉంచిన ఎఫ్35 విమానాన్ని హ్యాంగర్కు తగిలించి మరో చోటుకు తీసుకెళ్లారు. దాంతో ఇకమీద ఎయిర్పోర్టులో ఇతర విమానాల షెడ్యూల్ నిర్వహణకు ఎలాంటి అంతరాయం కలగదని అధికారులు పేర్కొన్నారు.
ఎఫ్ 35కి అన్ని రకాల రిపేర్లు పూర్తయ్యాక టేకాఫ్ అవుతుందని, అలా సాధ్యం కాకపోతే విమానాన్ని సీ 17 గ్లోబ్ మాస్టర్ ట్రాన్స్పోర్ట్ ప్లేన్లో తరలిస్తామని బ్రిటిష్ అధికారులు తెలిపారు. అయితే, జూన్ 14న కేరళ తీరంలో ఇండో–యూకే నేవీ విన్యాసాల్లో పాల్గొన్న ఎఫ్35 ఫైటర్ జెట్లో టెక్నికల్ సమస్య తలెత్తడంతో తిరువనంతపురంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
ఆపై టేకాఫ్ అయ్యేందుకు సిద్ధంకాగా, విమానంలో హైడ్రాలిక్ సమస్య ఉన్నట్లు గుర్తించారు. యూకే నేవీకి చెందిన ఇంజనీర్ల టీమ్ సరిచేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఫైటర్ జెట్ 22 రోజులుగా ఎయిర్పోర్టులోనే ఉండిపోయింది. తాజాగా యూకే టీం ప్రత్యేక పరికరాలతో తిరువనంతపురం చేరుకుంది.