హిడ్మా ఇలాకా పువ్వర్తిలో ‘బేలీబ్రిడ్జి’

హిడ్మా ఇలాకా పువ్వర్తిలో ‘బేలీబ్రిడ్జి’
  • ఆదివాసీ గ్రామాలకు తొలగిన దారి కష్టాలు 

భద్రాచలం, వెలుగు: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ మిలటరీ చీఫ్​ మడవి హిడ్మా సొంత ఊరు పువ్వర్తిలో బోర్డర్​ రోడ్​ ఆర్గనైజేషన్(బీఆర్​వో) బేలీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. ఈ బ్రిడ్జి పూర్తి కావడంతో దండకారణ్యంలోని ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం సుక్మా జిల్లా శత్రుదుర్భేద్యమైన మావోయిస్టుల కోట పువ్వర్తికి దారి కష్టాలు తీరాయి. 

ఇప్పటికే కేంద్ర హోంశాఖ పువ్వర్తిలో సీఆర్పీఎఫ్​ బలగాలతో బేస్​ క్యాంప్​ ఏర్పాటు చేయడంతో మావోయిస్టుల ప్రభావం తగ్గింది. ఇప్పుడు రహదారి నిర్మాణంతో పువ్వర్తి, సిల్గేర్, తిమ్మాపురం, గొల్లాకొండ, టేకల్​గూడ, జబ్బాగట్ట, తులంపాడ్​ గ్రామాల ఆదివాసీలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు మెరుగుపడతాయి. బేస్​ క్యాంప్​ వరకు వాహనాలు చేరుకుంటాయి. 

బేలీ డిజైన్​తో బ్రిడ్జి..

రూ.66 కోట్ల ఎల్​డబ్ల్యూఈ(లెఫ్ట్  వింగ్  ఎక్స్​మిజం) నిధులతో పువ్వర్తి గ్రామం వరకు 64 కి.మీల రహదారిని కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందులో ఎల్మాగూడ- పువ్వర్తి వరకు 51 కి.మీలు పూర్తిగా దండకారణ్యంలోనే ఉంది. రూ.53 కోట్ల ఖర్చుతో 51 కి.మీల రహదారిని సీఆర్పీఎఫ్​ బలగాల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతతో నిర్మించారు. 

పువ్వర్తి వద్ద ఉన్న వాగుపై 1940లో బ్రిటీష్​ సర్కారులో నాటి ఇంజనీర్​ డొనాల్డ్ బేలీ తయారు చేసిన డిజైన్​తో బేలీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. 15 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి పూర్తిగా స్టీల్​తో నిర్మించారు. భారీ వాహనాలు సైతం ఈ బ్రిడ్జిపై నుంచి వెళ్లవచ్చు. పువ్వర్తి గ్రామానికి చేరుకొనేందుకు అడ్డంకిగా ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణంతో రాకపోకలకు తిప్పలు తప్పాయి. దండకారణ్యంలోని కీలకమైన పువ్వర్తి ప్రస్తుతం భద్రతాబలగాల ఆధీనంలోకి వచ్చేసింది.